నేర్చుకుంటూ ఉండండి

మీరు లాగిన్ కాలేదు
మీ పురోగతిని తెలుసుకోవడానికి మరియు పాయింట్లను సేకరించి పోటీల్లోకి ప్రవేశించడానికి ‘త’ వేదికలో ఇప్పుడే నమోదు చేయండి, నమోదు తర్వాత మీరు నేర్చుకున్న అంశాల ఎలక్ట్రానిక్ సర్టిఫికెట్ మీకు లభిస్తుంది.

ప్రస్తుత విభాగం : model

పాఠం ప్రవక్తల పై విశ్వాసం

దైవప్రవక్తలను విశ్వసించడం విశ్వాస (ఈమాన్) ప్రాథమిక సూత్రాలలో ఒకటి. ఈ పాఠంలో మీరు దైవప్రవక్తలను విశ్వసించడం అంటే ఏమిటి, దాని ప్రాముఖ్యత, వారి గుణాలు మరియు వారి కొన్ని అద్భుతాల (మహిమల) గురించి తెలుసుకుంటారు.

  • దైవదూతలను విశ్వసించడం అంటే ఏమిటో తెలుసుకోవడం.
  • ప్రవక్తలు మరియు దైవదూతల గుణగణాలను గుర్తించడం.
  • వారు ప్రదర్శించిన కొన్ని మహిమల గురించి తెలుసుకోవడం.
  • వారిని విశ్వసించడం వల్ల కలిగే ఫలితాలను గ్రహించడం.

ప్రవక్తలను విశ్వసించడం అంటే

ప్రతి సమాజంలోనూ అల్లాహ్ వారి నుండే ఒక దైవప్రవక్తను పంపాడు అని నిశ్చయంగా విశ్వసించడమే ఇది. అల్లాహ్ కు ఎవరినీ భాగస్వాములుగా చేయకుండా, కేవలం ఆయనను మాత్రమే ఆరాధించాలని ఆ ప్రవక్తలు ప్రజలను ఆహ్వానించారు. దీనిని ధ్రువీకరిస్తూ అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: "నిశ్చయంగా మేము ప్రతి జాతిలోనూ ఒక ప్రవక్తను పంపాము. అల్లాహ్ ను మాత్రమే ఆరాధించండి మరియు అల్లాహ్ ను కాదని ఆరాధించబడే వాటన్నింటికీ (తాగూత్/ మిథ్యాదైవాలకు) దూరంగా ఉండండి అని వారు బోధించారు." (నహ్ల్: 36).

దైవప్రవక్తలందరూ సత్యశీలురు, సత్యవంతులుగా ధ్రువీకరించబడినవారు, దైవభీతి గలవారు, అత్యంత విశ్వసనీయులు మరియు స్వయంగా సన్మార్గంలో ఉంటూ ఇతరులకు మార్గదర్శనం చేసేవారని మేము విశ్వసిస్తున్నాము. అల్లాహ్ ఏ సందేశాన్ని అందజేయమని వారిని పంపారో, దానిని వారు యథాతథంగా అందజేశారు. వారు అల్లాహ్ సందేశాలలో దేనినీ దాచలేదు, మార్చలేదు మరియు తమ సొంతంగా అందులో ఒక అక్షరాన్ని కూడా అదనంగా చేర్చలేదు లేదా తగ్గించలేదు. దీని గురించి అల్లాహ్ ఈ విధంగా సెలవిచ్చాడు: "ఎవరైతే అల్లాహ్ సందేశాలను (ప్రజలకు) అందజేస్తారో, ఆయనకు భయపడతారో మరియు అల్లాహ్ తప్ప మరెవరికీ భయపడరో (అలాంటి వారికి అల్లాహ్ తోడ్పాటు ఉంటుంది). లెక్క చూసుకోవడానికి అల్లాహ్ ఒక్కడే చాలు." (అల్-అహ్జాబ్: 39).

ప్రజలకు దైవసందేశం యొక్క అవసరం

ప్రజలకు ధర్మ నియమాలను తెలియజేస్తూ, వారిని సత్యమార్గంలో నడిపించడానికి దైవిక సందేశం అత్యంత కీలకం. ఈ ప్రపంచానికి దైవ సందేశమే ఆత్మ(మూలాధారం), వెలుగు మరియు జీవం. మరి ఆత్మ, వెలుగు మరియు జీవమే లేనప్పుడు ఈ లోకానికి మేలు మరియు శుభం ఏ విధంగా కలుగుతాయి?

అందుకే అల్లాహ్ తన సందేశాన్ని రూహ్ (ఆత్మ ) అని అభివర్ణించాడు, ఎందుకంటే ఆత్మ లేనిదే ఏ విధంగా జీవం ఉండదో, దైవ సందేశం లేనిదే ఆత్మిక జీవనం సాధ్యం కాదు. దీని గురించి అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: మరియు (ఓ ప్రవక్తా!) ఈ విధంగా మేము మా ఆజ్ఞతో నీపై ఒక ఆత్మను (సందేశాన్ని/వహీని) పంపాము. అంతకుముందు నీకు గ్రంథం అంటే ఏమిటో, విశ్వాసం (ఈమాన్) అంటే ఏమిటో తెలియదు. కానీ మేము ఈ వహీని ఒక వెలుగుగా చేశాము. దీని ద్వారా మా దాసులలో మేము కోరిన వారికి సన్మార్గాన్ని చూపుతాము" (అష్-షూరా: 52). వాస్తవానికి మానవ బుద్ధి సాధారణంగా మంచి చెడులను గుర్తించగలిగినప్పటికీ, వాటి పూర్తి వివరాలను, సూక్ష్మ అంశాలను మరియు లోతుపాతులను గ్రహించజాలదు. దైవారాధనలు చేసే విధానం, వాటి పద్ధతులు మరియు రీతులు కేవలం వహీ మరియు దైవ సందేశం ద్వారా మాత్రమే తెలుస్తాయి.

ఇహపర లోకాలలో సౌభాగ్యం మరియు సాఫల్యం పొందడానికి ప్రవక్తల మార్గం తప్ప మరో మార్గం లేదు. అలాగే ఏది మంచి, ఏది చెడు అనే విషయాలను ఖచ్చితత్వంతో తెలుసుకోవడానికి వారి ద్వారా తప్ప వేరే మార్గం లేదు. ఎవరైతే ఈ దైవిక సందేశాన్ని విస్మరిస్తారో, వారు దానికి ఎంత దూరంగా ఉంటారో అంతటి అశాంతికి, ఆందోళనకు మరియు దురవస్థకు గురవుతారు. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: "మేము ఇలా అన్నాము: మీరందరూ ఇక్కడి నుండి దిగి వెళ్ళండి. ఇక నా తరపు నుండి మీకు మార్గదర్శకత్వం వచ్చినప్పుడు, ఎవరైతే నా మార్గదర్శకత్వాన్ని అనుసరిస్తారో వారికి ఎటువంటి భయం ఉండదు మరియు వారు దుఃఖించరు. కానీ ఎవరైతే తిరస్కరించి, మా సూచనలను అసత్యమని కొట్టిపారేస్తారో, అటువంటి వారు నరకవాసులు, వారు అందులో శాశ్వతంగా ఉంటారు." (అల్-బఖరా: 38, 39).

విశ్వాస మూల స్థంబాలలో ఒకటి:

ప్రవక్తలను విశ్వసించడం అనేది విశ్వాస (ఈమాన్) ప్రాథమిక సూత్రాలలో ఒకటి. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: "ప్రవక్త తన ప్రభువు తరపు నుండి తనపై అవతరించిన దానిని విశ్వసించాడు మరియు విశ్వాసులు కూడా. వారందరూ అల్లాహ్‌ను, ఆయన దైవదూతలను, ఆయన గ్రంథాలను మరియు ఆయన ప్రవక్తలను విశ్వసించారు. మేము ఆయన ప్రవక్తలలో ఎవరి మధ్య కూడా భేదభావం చూపము." (అల్-బఖరా: 285). ప్రవక్తలందరినీ ఎటువంటి వివక్ష లేకుండా విశ్వసించడం తప్పనిసరి అని ఈ ఆయత్ తెలియజేస్తోంది. కాబట్టి, యూదులు మరియు క్రైస్తవుల వలె మేము కొందరు ప్రవక్తలను విశ్వసించి మరికొందరిని తిరస్కరించము.

దైవప్రవక్త ముహమ్మద్(స) వారు విశ్వాసం (ఈమాన్) గురించి ఇలా సెలవిచ్చారు: "నీవు అల్లాహ్‌ను, ఆయన దైవదూతలను, ఆయన గ్రంథాలను, ఆయన ప్రవక్తలను, అంతిమ దినాన్ని విశ్వసించడం మరియు విధిని, అందులోని మంచి చెడులను విశ్వసించడం." (ముస్లిం 8).

ప్రవక్తల నిదర్శనాలు మరియు వారి అద్భుతాలు

అల్లాహ్ తన ప్రవక్తల సత్యశీలతను మరియు వారి ప్రవక్త పదవిని నిరూపించడానికి వివిధ రకాల ఆధారాలతో మరియు నిదర్శనాలతో వారిని బలపరిచాడు. అందులో భాగంగా, మానవ శక్తికి మించిన స్పష్టమైన అద్భుతాలు (మోజిజా) మరియు నిదర్శనాల ద్వారా వారికి తోడ్పాటును అందించాడు. దీని ఉద్దేశ్యం వారి సత్యశీలతను స్థిరపరచడం మరియు వారి ప్రవక్త పదవిని నిరూపించడం. అద్భుతాలు అంటే: అల్లాహ్ తన ప్రవక్తల ద్వారా వ్యక్తపరిచే సాధారణ ప్రకృతి నియమాలకు విరుద్ధమైన అసాధారణ కార్యాలు, వీటిని మనుషులు ఎవరూ సృష్టించలేరు.

దైవప్రవక్తల (అ ) అద్భుతాల నుండి కొన్ని:

١
మూసా అలైహిస్సలాం వారి కర్ర పాముగా మారడం.
٢
ఈసా అలైహిస్సలాం వారు తమ జాతి ప్రజలు ఏమి తింటున్నారో మరియు వారి ఇళ్లలో ఏమి దాచుకుంటున్నారో వారికి తెలియజేయడం.
٣
దైవప్రవక్త ముహమ్మద్(స) వారి కోసం చంద్రుడు రెండు ముక్కలవ్వడం.

దైవప్రవక్తలను విశ్వసించడంలో ఏమేమి అంశాలు ఉంటాయి?

1- వారి సందేశాలన్నీ అల్లాహ్ తరపు నుండి వచ్చిన సత్యాలని మరియు ఆ సందేశాలన్నీ అల్లాహ్ ను మాత్రమే ఆరాధించాలని, ఆయనకు ఎవరినీ సాటి కల్పించకూడదని పిలుపునివ్వడంలో ఏకీభవించాయని విశ్వసించడం.

అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: "నిశ్చయంగా, మేము ప్రతి జాతిలోనూ ఒక దైవప్రవక్తను పంపాము. (వారి ద్వారా మేము ఇచ్చిన సందేశం ఏమిటంటే) 'అల్లాహ్ ను మాత్రమే ఆరాధించండి మరియు తాగూత్ (కల్పిత/ఊహాజనిత ఆరాధ్య దైవాల)కు దూరంగా ఉండండి'." (అన్-నహ్ల్: 36).

ఆయా జాతులకు అనుగుణంగా, ధర్మశాస్త్రాలలోని హలాల్ (అనుమతించబడిన) మరియు హరామ్ (నిషేధించబడిన) వంటి ఇతర నిబంధనలలో దైవప్రవక్తల విధివిధానాలు భిన్నంగా ఉండవచ్చు. దీని గురించి అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: "మేము మీలో ప్రతి ఒక్కరి కోసం ఒక ప్రత్యేక ధర్మనియమావళిని మరియు ఒక మార్గాన్ని నిర్ణయించాము." (అల్-మాయిదా: 48).

2- దైవప్రవక్తలు మరియు సందేశహరులందరినీ విశ్వసించడం.

అల్లాహ్ ఎవరి పేర్లనైతే తెలిపాడో ఆ దైవప్రవక్తలందరినీ మేము విశ్వసిస్తాము. ఉదాహరణకు: ముహమ్మద్, ఇబ్రాహీం, మూసా, ఈసా, నూహ్, యాఖూబ్, యూసుఫ్, యూనుస్ మరియు ఇతర దైవప్రవక్తలు (అలైహిముస్సలాం). ఎవరి పేర్లైతే మనకు తెలియవో, వారందరినీ కూడా మేము మొత్తంగా విశ్వసిస్తాము. ఎవరైనా ఒక్క దైవప్రవక్త సందేశాన్ని తిరస్కరించినా, వారు ప్రవక్తలందరినీ తిరస్కరించినట్లే అవుతుంది.

ప్రవక్తల వార్తలలో మరియు వారి అద్భుతాలలో (మోజిజాలలో) ప్రామాణికమైన, నిరూపించబడిన వాటిని ధ్రువీకరించడం.

ఖుర్ఆన్ మరియు సున్నతులలో దైవప్రవక్తల వృత్తాంతాలు మరియు వారి అద్భుతాలకు సంబంధించి ఏవైతే నిరూపించబడి ఉన్నాయో, ప్రామాణికంగా ఉన్నాయో, వాటన్నింటినీ మేము సత్యమని ధృవీకరిస్తాము. ఉదాహరణకు: మూసా అలైహిస్సలాం వారి కోసం సముద్రం రెండుగా చీలిపోయిన ఉదాహరణ వంటివి.

మన వద్దకు పంపబడిన ప్రవక్తలందరిలో అత్యుత్తములు మరియు ఆఖరి ప్రవక్త అయిన ముహమ్మద్(స) వారి షరిఅత్‌ (దైవిక నియమాల)ను అనుసరించడం.

దైవప్రవక్తల గుణాలలో కొన్ని:

1. వారు కూడా మనుషులే

వారికి మరియు ఇతరులకు మధ్య ఉన్న వ్యత్యాసం ఏమిటంటే, అల్లాహ్ వారిని వహీ (దైవవాణి) మరియు ప్రవక్తత్వంతో ప్రత్యేకించాడు. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: "మేము నీకు పూర్వం కూడా పురుషులనే ప్రవక్తలుగా పంపాము, వారి వద్దకు మేము వహీ(దైవవాణి)ని పంపేవాళ్ళము." (అల్-అంబియా: 7). అల్లాహ్ ఇంకా ఇలా సెలవిచ్చాడు: "నీవు ఇలా చెప్పు: నేను కూడా మీ లాంటి ఒక మనిషినే, అయితే మీ ఆరాధ్య దైవం ఒక్కడేనని నా వద్దకు వహీ పంపబడుతోంది. (అల్-కహఫ్: 110). "కాబట్టి, వారిలో రుబూబియత్ (సృష్టికర్త, పోషకుడు మరియు నిర్వహకుడు అనే గుణాలు) కానీ, లేదా ఉలూహియత్ (ఆరాధనకు అర్హుత అనే దైవత్వపు గుణాలు) కానీ ఏమాత్రం లేవు."వారు బాహ్య రూపంలో పరిపూర్ణతను, అలాగే నైతిక ప్రవర్తనలో అత్యున్నత స్థాయిని చేరుకున్న మనుషులు. అంతేకాకుండా, వారు మానవులందరిలో అత్యున్నత వంశానికి చెందినవారు. దైవ సందేశం యొక్క బాధ్యతలను మరియు ప్రవక్తత్వ భారాన్ని, బాధ్యతను మోయడానికి తగిన విచక్షణా జ్ఞానం మరియు స్పష్టమైన మాట తీరు వారు కలిగి ఉన్నారు. ప్రజలు తమ జాతికి చెందిన ప్రవక్తలనే ఆదర్శంగా (రోల్ మోడల్స్) తీసుకోవాలని అల్లాహ్ మనుషులనే ప్రవక్తలుగా పంపాడు. తద్వారా దైవప్రవక్తను అనుసరించడం మరియు వారిని ఆదర్శంగా తీసుకోవడం మానవులకు తమ శక్తి మేరకు సాధ్యమవుతుంది.

వారిని అల్లాహ్ ప్రవక్త పదవి కోసం ప్రత్యేకించుకున్నాడు.

అల్లాహ్ ఇతర మానవులందరినీ కాదని, వీరిని మాత్రమే వహీ (దైవవాణి) కోసం ప్రత్యేకించుకున్నాడు. దీని గురించి అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: "అల్లాహ్ దైవదూతల నుండి మరియు మానవుల నుండి తన సందేశహరులను ఎంచుకుంటాడు. నిశ్చయంగా అల్లాహ్ సమస్తాన్ని వినేవాడు, చూసేవాడు" (హజ్: 75). కావున, ప్రవక్త పదవి మరియు దౌత్యం అనేవి కేవలం మనస్సును, ఆత్మను పవిత్రం చేసుకోవడం ద్వారా గానీ, లేదా మానవ మేధస్సు మరియు తెలివితేటల ద్వారా గానీ లభించేవి కావు. అవి అల్లాహ్ స్వయంగా ఎంచుకునే ఉన్నతమైన పదవులు. తన సందేశాన్ని అందించే బాధ్యతను ఎవరికి అప్పగించాలో అల్లాహ్ కు తెలుసు. అవి కేవలం దైవికమైన ఎంపిక మాత్రమే. దీని గురించి అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: "తన సందేశానికి ఎవరు అర్హులో అల్లాహ్ కు బాగా తెలుసు" (అన్ఆమ్: 124).

వారు అల్లాహ్ తరపున ఏదైతే సందేశాన్ని అందిస్తున్నారో వారు అందులో సత్యవంతులు

దైవసందేశాన్ని చేరవేయడంలో వారు ఎలాంటి పొరపాట్లు చేయరు, అలాగే అల్లాహ్ వారికి ఇచ్చిన ఆదేశాలను పాటించడంలోనూ వారు ఎన్నడూ తప్పు చేయరు.

4- సత్యసంధత

దైవప్రవక్తలు(అలైహిముస్సలాం) తమ మాటలలోనూ మరియు ఆచరణలలోనూ సత్యవంతులు. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: "అపార కారుణ్యము గల అల్లాహ్ వాగ్దానం చేసింది ఇదే, మరియు దైవప్రవక్తలు సత్యమే పలికారు" (యాసీన్: 52).

5- సహనం వహించడం

వారు శుభవార్తలు వినిపించేవారుగా మరియు హెచ్చరించేవారుగా అల్లాహ్ ధర్మం వైపునకు ఆహ్వానించారు. ఆ మార్గంలో వారు అనేక రకాల బాధలను, రక రకాల కష్టాలను ఎదుర్కొన్నారు. అయినప్పటికీ అల్లాహ్ యొక్క వాక్యాన్ని/ధర్మాన్ని ఉన్నతమైనదిగా ఉంచడం కోసం వారు ఎంతో సహనం వహించారు మరియు ఓర్చుకున్నారు. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: "కాబట్టి (ఓ ప్రవక్తా!) దృఢ సంకల్పం కలిగిన దైవప్రవక్తలు సహనం వహించినట్లే మీరు కూడా సహనం వహించండి " (అహ్ ఖాఫ్: 35).

దైవప్రవక్తలను విశ్వసించడం వల్ల కలిగే గొప్ప ప్రయోజనాలలో కొన్ని:

١
అల్లాహ్ యొక్క కారుణ్యం మరియు తన దాసుల పట్ల ఆయనకు ఉన్న శ్రద్ధను గురించి తెలుసుకోవడం. ఆయన వారిని సరైన మార్గంలో నడిపించడానికి మరియు అల్లాహ్‌ను ఎలా ఆరాధించాలో వివరించడానికి దైవప్రవక్తలను పంపాడు. ఎందుకంటే మానవ మేధస్సు స్వయంగా ఆ విషయాన్ని గ్రహించజాలదు. దైవప్రవక్త ముహమ్మద్(స) వారి గురించి అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: "(ఓ ప్రవక్తా!) మేము మిమ్మల్ని సమస్త లోకాల పాలిట ఒక కారుణ్యంగా మాత్రమే పంపించాము."(అల్ అంబియా: 107).
٢
ఈ గొప్ప అనుగ్రహానికి గాను అల్లాహ్‌కు కృతజ్ఞతలు తెలుపుకోవడం.
٣
దైవప్రవక్తలను(అ) ప్రేమించడం, వారిని గౌరవించడం మరియు వారికి తగిన రీతిలో వారిని ప్రశంసించడం, ఎందుకంటే వారు అల్లాహ్‌ను ఆరాధించే బాధ్యతను నెరవేర్చారు, ఆయన సందేశాన్ని చేరవేశారు మరియు ఆయన దాసులకు హితబోధ చేశారు.
٤
దైవప్రవక్తలు అల్లాహ్ తరపున తీసుకువచ్చిన సందేశాన్ని అనుసరించడం. అదేమిటంటే ఆరాధనలో అల్లాహ్‌కు ఎవరినీ భాగస్వాములుగా చేయకుండా, కేవలం ఆయనను మాత్రమే ఆరాధించడం మరియు ఆ సందేశం ప్రకారం నడుచుకోవడం. దీనివల్ల విశ్వాసులకు తమ జీవితాల్లో శుభం, సన్మార్గం మరియు ఇహపర లోకాల్లో సౌభాగ్యం సిద్ధిస్తాయి.

అల్లాహ్ సెలవిచ్చాడు: ఎవరైతే నా మార్గదర్శకత్వాన్ని అనుసరిస్తారో, వారు దారి తప్పరు మరియు దుర్భర స్థితికి లోనుకావరు. కానీ ఎవరైతే నా స్మరణ (బోధన) పట్ల విముఖత చూపుతారో, నిశ్చయంగా వారికి ఇరుకైన (కష్టభరితమైన) జీవితం ఉంటుంది." (తాహా: 123-124)

మీరు విజయవంతంగా మీ పాఠాలను పూర్తి చేశారు


పరీక్ష మొదలుపెట్టండి