ప్రస్తుత విభాగం : model
పాఠం ఈదుల్ ఫిత్ర్ మరియు ఈదుల్ అద్'హా
ఈద్ అల్ ఫిత్ర్
ఇది ఇస్లామీయ క్యాలెండర్లోని పదవ నెల అయిన షవ్వాల్ మొదటి రోజు. రమదాన్ నెల చివరి రోజు ముగిసిన తర్వాత ఇది వస్తుంది, అందుకే దీనిని ఈద్ ఉల్ ఫిత్ర్ అని పిలుస్తారు. రమదాన్ నెలలో ఉపవాసాల ద్వారా అల్లాహ్ ను ఆరాధించినట్లే, ఈ రోజున ఉపవాసం విరమించడం ద్వారా (ఆ రోజున ఉపవాసం ఉండకూడదు కాబట్టి) ప్రజలు అల్లాహ్ ను ఆరాధిస్తారు. అల్లాహ్ తమకు పవిత్ర రమదాన్ నెల ఉపవాసాలను పూర్తి చేసే భాగ్యాన్ని కల్పించినందుకు, ఆయన అనుగ్రహానికి మరియు కృపకు కృతజ్ఞతగా వారు ఈ పండుగను జరుపుకుంటారు. అల్లాహ్ ఇలా సెలవిచ్చారు: "మీరు ఆ గడువును (ఉపవాసాల సంఖ్యను) పూర్తి చేయాలని, అల్లాహ్ మీకు ప్రసాదించిన సన్మార్గ భాగ్యానికి గాను మీరు ఆయన మహనీయతను (ఘనతను) చాటుకుంటూ, కృతజ్ఞతలు తెలుపుకోవాలన్నదే దీని ఉద్దేశ్యం." (బఖరా: 185).
ఈదుల్ ఫిత్ర్ రోజున ఏమి చేయడం ధర్మసమ్మతం?
అల్లాహ్, తన అవసరాలకు మించి ఆహారం ఉన్న ప్రతి ముస్లింపై ఈద్ రోజు మరియు ఆ రాత్రికి గాను జకాతుల్ ఫిత్ర్ దానం చెల్లించడాన్ని విధిగా నిర్ణయించాడు. దీని ప్రకారం ఆయా ప్రాంతాల ప్రజలు ఆహారంగా తీసుకునే బియ్యం, గోధుమలు లేదా ఖర్జూరాలు వంటి వాటి నుండి ఒక సా (సుమారు రెండున్నర కిలోలు) పరిమాణంలో ముస్లిములలోని పేదలకు, నిరుపేదలకు అందజేయాలి. ఈద్ రోజున ఎవరూ ఏ వస్తువు కోసం ఇబ్బంది పడకూడదన్నదే దీని ఉద్దేశం.
రమదాన్ చివరి రోజు సూర్యాస్తమయం నుండి ఈద్ నమాజు వరకు దీని సమయం. అయితే ఈద్కు ఒకటి లేదా రెండు రోజుల ముందే దీనిని చెల్లించడం ధర్మసమ్మతం.
ప్రాంతీయ ప్రజలు ఆహారంగా తీసుకునే గోధుమలు, బియ్యం లేదా ఖర్జూరాలు వంటి వాటి నుండి ఒక 'సా' పరిమాణంలో దీనిని చెల్లించాలి. 'సా' అనేది కొలతకు సంబంధించినది, అయితే ఆధునిక ప్రమాణాల ప్రకారం ఖచ్చితత్వం కోసం బరువుతో లెక్కించడం సులభం. దీని బరువు సుమారు 3 కిలోగ్రాములకు సమానంగా ఉంటుంది.
ఈద్ రోజు మరియు ఆ రాత్రికి తన అవసరాలకు మించి ఆహారం ఉన్న ప్రతి ముస్లింపై ఇది విధిగా ఉంటుంది. దీనిని తన తరపున మరియు తనపై ఆధారపడిన భార్యాపిల్లల తరపున చెల్లించాలి. అలాగే తల్లి గర్భంలో ఉన్న శిశువు (పిండం) తరపున కూడా దీనిని చెల్లించడం అభిలషణీయం. దీని ప్రకారం ఒక్కొక్కరి తరపున ఆయా ప్రాంతాల ఆహార ధాన్యాల నుండి ఒక 'సా' అంటే సుమారు 3 కిలోగ్రాముల పరిమాణంలో దానం చేయాలి.
సదకతుల్ ఫిత్ర్ యొక్క ఉద్దేశ్యం
దైవప్రవక్త ముహమ్మద్(స) వారు ఉపవాసకుడిని వ్యర్థమైన మరియు అనుచితమైన మాటల నుండి పవిత్రం చేయడానికి (అనగా: ఉపవాస సమయంలో దొర్లిన పొరపాట్లను శుద్ధి చేయడానికి మరియు ఉపవాస మర్యాదలలో ఉన్న లోపాలను భర్తీ చేయడానికి) దీనిని (జకాతుల్ ఫిత్ర్) విధిగావించారు.
ఇది ముస్లిముల రెండవ పండుగ. ఇది జుల్ హిజ్జా (ఇస్లామీయ క్యాలెండర్ ప్రకారం పన్నెండవ నెల) పదవ రోజున వస్తుంది. దీనిలో అనేక విశిష్టతలు ఉన్నాయి, వాటిలో కొన్ని:
1. ఇది సంవత్సరంలోని అత్యంత శ్రేష్ఠమైన రోజులలో ఒకటి.
సంవత్సరంలోని అన్ని రోజులలో జుల్ హిజ్జా నెలలోని మొదటి పది రోజులు అత్యంత శ్రేష్ఠమైనవి. దీని గురించి దైవప్రవక్త ముహమ్మద్(స) వారు ఈ విధంగా సెలవిచ్చారు: "ఈ పది రోజులలో చేసే సత్కార్యాల కంటే అల్లాహ్ కు అత్యంత ప్రియమైనవి మరి ఏ ఇతర రోజులలోనూ లేవు". అప్పుడు వారి(స) అనుచరులు(ర), "దైవప్రవక్తా! అల్లాహ్ మార్గంలో చేసే ధర్మపోరాటం కూడా వీటికి సాటి రాదా?" అని అడిగారు. దానికి దైవప్రవక్త ముహమ్మద్(స) వారు ఇలా సెలవిచ్చారు: "అవును, అల్లాహ్ మార్గంలో చేసే ధర్మపోరాటం కూడా సాటి రాదు. అయితే ఒక వ్యక్తి తన ప్రాణాన్ని, సంపదను పణంగా పెట్టి అల్లాహ్ మార్గంలో బయలుదేరి, తన ప్రాణాన్ని మరియు సంపదను అల్లాహ్ మార్గంలోనే అర్పించి, తిరిగి ఏమీ తీసుకురాకుండా అక్కడే అమరవీరుడైన సందర్భం తప్ప" (బుఖారీ 969, తిర్మిజీ 757).
దీనిలో కాబా గృహం చుట్టూ తవాఫ్ చేయడం, ఖుర్బానీ (హద్యి) ఇవ్వడం మరియు జమరతుల్ అఖబా వద్ద కంకరరాళ్లను విసరడం వంటి హజ్’కు సంబంధించిన అత్యంత విశిష్టమైన, ముఖ్యమైన మరియు గౌరవప్రదమైన కార్యాలు ఇమిడి ఉన్నాయి.
ఈదుల్ అద్’హా పండుగ రోజున ఏయే కార్యాలు ధర్మబద్ధమైనవి?
ఈదుల్ ఫిత్ర్ పండుగ సందర్భంలో ఏవైతే ధర్మబద్ధమైన కార్యాలు నిర్ణయించబడ్డాయో, అవన్నీ ఈదుల్ అజ్ హా పండుగ రోజున కూడా హజ్ యాత్రలో లేని వారికి వర్తిస్తాయి. అయితే, సదకతుల్ ఫిత్ర్ మాత్రం కేవలం ఈదుల్ ఫిత్ర్ పండుగకు మాత్రమే ప్రత్యేకించబడింది. అల్లాహ్ సంతుష్ఠత కోసం ఖుర్బానీ ఇవ్వడం అనేది ఈదుల్ అద్’హా పండుగ యొక్క విశిష్టత.
ఈద్-ఉల్-అద్’హా (బక్రీద్) పండుగ రోజున ఈద్ నమాజ్ పూర్తయినప్పటి నుండి జిల్ హిజ్జా నెల 13వ తేదీ సూర్యాస్తమయం వరకు అల్లాహ్ ప్రీతి కోసం అర్పించే ఒంటెలు, ఆవులు లేదా గొర్రె (మేక)లను ఖుర్బానీ అంటారు. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: "కాబట్టి నీ ప్రభువు కొరకే నమాజ్ చేయి మరియు ఖుర్బానీ ఇవ్వు." (అల్-కౌసర్: 2). ఇక్కడ నమాజ్ అంటే ఈద్ నమాజ్ అని మరియు ఖుర్బానీ అంటే పండుగనాడు ఇచ్చే ఖుర్బానీ అని వివరించబడింది.
దాని గురించిన నియమం
దీనిని నిర్వహించగలిగే స్తోమత ఉన్నవారికి ఇది సున్నతే ముఅక్కదా (తప్పకుండా ఆచరించవలసిన సున్నతు). ముస్లిము తన తరపున మరియు తన ఇంటివారందరి తరపున ఖుర్బానీ ఇవ్వాలి.
ఖుర్బానీ ఇవ్వాలని సంకల్పించిన వారు దిల్ హిజ్జా నెలవంక కనిపించినప్పటి నుండి ఖుర్బానీ ఇచ్చే వరకు తమ వెంట్రుకలను, గోర్లను మరియు శరీర చర్మ భాగాలను ఏమాత్రం తీయకూడదు.
ఖుర్బానీ (ఉద్హియ) ఇచ్చే జంతువుకు ఉండవలసిన నిబంధనలు:
గొర్రెలు, ఆవులు లేదా ఒంటెలు. ఇవి తప్ప ఇతర జంతువులు లేదా పక్షులతో కుర్బానీ (ఉద్హియ) ఇవ్వడం చెల్లదు. ఒక వ్యక్తికి మరియు అతని ఇంటి వారందరికీ ఒక గొర్రె లేదా మేక సరిపోతుంది. అలాగే ఒక ఆవు లేదా ఒక ఒంటెలో ఏడుగురు వ్యక్తులు భాగస్వాములుగా చేరడం అనుమతించబడింది.
నిర్దేశించిన వయస్సు నిండి ఉండాలి.
ఖుర్బానీ జంతువులకు ఉండవలసిన కనీస వయస్సు: గొర్రెలకు ఆరు నెలలు, మేకలకు ఒక సంవత్సరం, ఆవులకు రెండు సంవత్సరాలు మరియు ఒంటెలకు ఐదు సంవత్సరాలు నిండి ఉండాలి.
జంతువుకు బాహ్య లోపాలు ఏవీ లేకుండా ఆరోగ్యంగా ఉండాలి.
దైవప్రవక్త ముహమ్మద్(స) వారు సెలవిచ్చారు: "ఖుర్బానీలో నాలుగు రకాల జంతువులు చెల్లవు: స్పష్టంగా కనిపించే ఒంటికన్ను లోపం గలది, స్పష్టంగా కనిపించే అనారోగ్యం కలది, స్పష్టంగా కనిపించే కుంటితనం ఉన్నది మరియు ఎముకల్లో గుజ్జు లేనంతగా బాగా చిక్కిపోయినది" (నసయి 4370, తిర్మిజీ 1497).