నేర్చుకుంటూ ఉండండి

మీరు లాగిన్ కాలేదు
మీ పురోగతిని తెలుసుకోవడానికి మరియు పాయింట్లను సేకరించి పోటీల్లోకి ప్రవేశించడానికి ‘త’ వేదికలో ఇప్పుడే నమోదు చేయండి, నమోదు తర్వాత మీరు నేర్చుకున్న అంశాల ఎలక్ట్రానిక్ సర్టిఫికెట్ మీకు లభిస్తుంది.

ప్రస్తుత విభాగం : model

పాఠం మనసులలోని మూఢనమ్మకాలపై పోరాటం

ఇస్లాం, మానవ సహజ స్వభావానికి (ఫిత్రత్) మరియు సరైన వివేచనకు ప్రాధాన్యతనిచ్చే ధర్మం. అందుకే, మనుషుల ఇహపర లోకాల జీవితాలను నాశనం చేసే అన్ని రకాల మూఢనమ్మకాలను, అపోహలను ఇది తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఈ పాఠంలో మీరు వాటి గురించిన పూర్తి వివరాలను తెలుసుకుంటారు.

  • మూఢనమ్మకాలు మరియు అపోహల పట్ల ఇస్లాం ధర్మం యొక్క స్పష్టమైన వైఖరిని అవగాహన చేసుకోవడం.
  • వివిధ రకాల అసత్య విశ్వాసాల మరియు ఆచారాల పట్ల ఇస్లాం ఇచ్చే తీర్పును గురించి తెలుసుకోవడం.

ఇస్లాం రాకముందు అరబ్బులతో పాటు ప్రపంచంలోని ఇతర జాతులన్నీ పురాణగాథలు, మూఢనమ్మకాలు మరియు అపోహల్లో కూరుకుపోయి ఉండేవారు. ఇవి భూమండలమంతటా ఎంతలా వ్యాపించి ఉన్నాయంటే, ఏ ఒక్క సమాజం కూడా వీటి ప్రభావం నుండి తప్పించుకోలేకపోయింది. చివరికి ప్రారంభంలో అరబ్బులు కూడా—పవిత్ర ఖురాన్‌ను చూసి—అది కూడా ఒక రకమైన కట్టుకథ లేదా మంత్రజాలమని భ్రమపడ్డారు.

అయితే, ఇస్లాం ధర్మం తన దివ్య కాంతితో మరియు మార్గదర్శకత్వంతో ఆవిర్భవించినప్పుడు, మనస్సును మరియు ఆత్మను పవిత్రం చేసే సూత్రాలను ప్రసాదించింది. ఈ నిబంధనల ద్వారా మూఢనమ్మకాలు, కట్టుకథలు మరియు అపోహల సంకెళ్ల నుండి మానవ వివేచనకు, బుద్ధికి విముక్తి కలిగించింది. అంతేకాకుండా, సృష్టించబడిన వస్తువులపై కాకుండా, కేవలం సృష్టికర్త అయిన అల్లాహ్‌పైనే పూర్తి నమ్మకం కలిగి ఉండేలా మనుషులను తీర్చిదిద్దింది. వాటిలో కొన్ని ముఖ్యమైనవి:

సిహర్ (చేతబడి) మరియు క్షుద్ర విద్యలతో పోరాటం:

ఇస్లాం ధర్మం మంత్రజాలం, చేతబడి మరియు జ్యోతిష్యం వంటి అన్ని రకాల దురాచారాలను ఖచ్చితంగా నిషేధించింది. వీటిని 'షిర్క్' (అల్లాహ్‌కు భాగస్వామ్యం కల్పించడం) మరియు మార్గభ్రష్టత్వంగా పరిగణించింది. మంత్రతంత్రాలకు పాల్పడేవారు ఇటు ఇహలోకంలోనూ, అటు పరలోకంలోనూ ఎన్నటికీ విజయం సాధించలేరని స్పష్టం చేసింది. దీని గురించి అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు : "మంత్రగాడు ఎక్కడికి వెళ్ళినా, ఏ పద్ధతిని అనుసరించినా అతను ఎన్నటికీ విజయం సాధించలేడు" (సూరా తాహా: 69).

ఒక ముస్లిము మంత్రగాళ్ళ వద్దకు మరియు జ్యోతిష్యుల వద్దకు వెళ్లడాన్ని, వారిని అడగడాన్ని, వారి ద్వారా స్వస్థతను లేదా చికిత్సను మరియు సమస్యల పరిష్కారాన్ని కోరడాన్ని కూడా ధర్మం నిషేధించింది. అలా చేసిన వారు దైవప్రవక్త ముహమ్మద్(స) వారిపై అవతరింపజేయబడిన దానిని తిరస్కరించినవారని (కాఫిర్) అభివర్ణించింది. ఎందుకంటే లాభనష్టాలు అల్లాహ్ చేతిలోనే ఉన్నాయి మరియు అగోచర జ్ఞానం (గైబ్) ఆయనకు తప్ప మరెవరికీ తెలియదు. దైవప్రవక్త ముహమ్మద్(స) వారు ఈ విధంగా సెలవిచ్చారు: “ఎవరైనా సోదె చెప్పేవాడి దగ్గరకు లేదా జ్యోతిష్యుడి దగ్గరకు వెళ్లి, అతను చెప్పేది నిజమని నమ్మితే, అతను ముహమ్మద్ పై అవతరింపజేయబడిన దానిని తిరస్కరించినట్లే” (ముస్తద్రక్ అల్-హాకిమ్: 15).

లాభనష్టాలు అనేవి అల్లాహ్ చేతిలో ఉంటాయి

మానవులు, జిన్నాతులు, చెట్లు, రాళ్లు మరియు గ్రహాలతో సహా సృష్టిలోని సమస్తమూ -అవి ఎంత గొప్పవైనప్పటికీ, ఎంత విశాలమైనవైనప్పటికీ - అల్లాహ్ యొక్క సృష్టి వైభవానికి నిదర్శనాలని అల్లాహ్ స్పష్టం చేశాడు. ఈ విశ్వంపై ప్రభావం చూపగల అసాధారణ శక్తులు ఏ మానవుడికీ లేవు. సృష్టి, ఆజ్ఞ, సామర్థ్యం మరియు నిర్వహణ అంతా కేవలం అల్లాహ్ ఆదేశానుసారమే జరుగుతాయి. అల్లాహ్ ఈ విధంగా సెలవిచ్చాడు: "నిశ్చయంగా, సర్వసృష్టి ఆయనదే! మరియు ఆజ్ఞ నడిచేది ఆయనదే. అల్లాహ్ ఎంతో శుభదాయకుడు, సర్వ లోకాలకు పోషకుడు! "(ఆరాఫ్ : 54)

ఆ సృష్టిరాశుల గొప్పతనాన్ని మరియు వాటి నిర్మాణంలోని నైపుణ్యాన్ని గమనించిన ఎవరైనా, వాటన్నింటినీ సృష్టించినవాడు సర్వశక్తిమంతుడైన అల్లాహ్ మాత్రమేనని గ్రహిస్తారు. ఆయనే ఈ విశ్వాన్ని నిర్వహించే ప్రభువు, కాబట్టి సమస్త ఆరాధనలు ఆయనకే చెందాలి. ఆయనే సృష్టికర్త, మిగిలినవన్నీ ఆయన సృష్టించినవే. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: "రేయింబవళ్లు, సూర్యచంద్రులు ఆయన సూచనలలోనివి. మీరు సూర్యునికి గానీ, చంద్రునికి గానీ సాష్టాంగం చేయకండి. మీరు నిజంగా ఆయననే ఆరాధించేవారైతే, వాటిని సృష్టించిన అల్లాహ్‌కే సాష్టాంగం చేయండి" (ఫుస్సిలత్: 37).

అగోచర జ్ఞానం మరియు భవిష్యత్తు గురించి అల్లాహ్ కు తప్ప మరెవరికీ తెలియదు.

అగోచర జ్ఞానం (గైబ్) మరియు భవిష్యత్తు గురించి కేవలం తనకు మాత్రమే తెలుసని అల్లాహ్ తెలియజేశాడు. భవిష్యత్తును చెబుతామని చెప్పుకునే సోదెగాళ్లు మరియు జ్యోతిష్కులు అబద్ధాలకోరులు. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: "అగోచర జ్ఞానపు తాళపుచెవులు ఆయన వద్దనే ఉన్నాయి, ఆయన తప్ప మరెవరూ వాటిని ఎరుగరు" (అన్ఆమ్: 59).

సృష్టి రాశులందరిలో ఉత్తములు మరియు అత్యంత గౌరవనీయులైన దైవప్రవక్త ముహమ్మద్(స) వారు కూడా స్వయంగా తమకు తాము ఎటువంటి లాభాన్ని గానీ, నష్టాన్ని గానీ చేకూర్చుకునే అధికారం కలిగి లేరు. అలాగే వారికి అగోచర జ్ఞానం మరియు భవిష్యత్తు గురించి తెలియదు. ఇక గౌరవంలోనూ, స్థానంలోనూ వారి కంటే తక్కువ స్థాయిలో ఉన్నవారి పరిస్థితి ఏమిటి? అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: "నీవు ఇలా చెప్పు: ‘అల్లాహ్ తలచుకుంటే తప్ప, నా స్వయానికి కూడా నేను ఎటువంటి లాభాన్ని చేకూర్చుకోలేను మరియు ఎటువంటి నష్టాన్ని నివారించుకోలేను. ఒకవేళ నాకు అగోచర జ్ఞానం తెలిసి ఉంటే, నేను ఎంతో మేలును సమకూర్చుకునేవాడిని మరియు నాకు ఎన్నడూ ఎటువంటి కీడు జరిగేది కాదు. నేను కేవలం విశ్వసించే వారికి హెచ్చరిక చేసేవాడిని మరియు శుభవార్త వినిపించేవాడిని మాత్రమే’" (అల్-అరాఫ్: 188).

అపశకునాలు, అరిష్టాలు మరియు దుశ్శకునాలను విశ్వసించడం నిషిద్ధం. (ఈ చెడు విశ్వాసాన్ని ఉర్దూలో "బద్ ఫాలీ" అంటారు)

ఇస్లాం ధర్మం వస్తువులు, రంగులు, మాటలు మరియు అటువంటి ఇతర విషయాల ద్వారా అపశకునాలను లేదా అరిష్టాలను నమ్మడాన్ని నిషేధించింది. దానికి బదులుగా శుభశకునాలను, శుభసూచకాలను (ఈ మంచి విశ్వాసాన్ని ఉర్దూలో ‘నేక్ ఫాలీ’ అంటారు) మరియు భవిష్యత్తు పట్ల సానుకూల దృక్పథంతో ఉండటాన్ని ప్రోత్సహించింది.

తియరహ్(అపశకునం )కు ఉదాహరణ: ఒక వ్యక్తి తన ప్రయాణం ప్రారంభంలో ఏదైనా ఒక రకమైన పక్షిని చూసినా లేదా దాని అరుపు విన్నా, తన ప్రయాణం గురించి అపశకునంగా భావించి, ఆ ప్రయాణాన్ని ఆపివేయడం లేదా మధ్యలోనే విరమించుకోవడం. దైవప్రవక్త ముహమ్మద్(స) వారు దీనిని షిర్క్ (దైవానికి భాగస్వామ్యం కల్పించడం) అని అభివర్ణిస్తూ ఇలా సెలవిచ్చారు: "అపశకునాలను నమ్మడం షిర్క్ అవుతుంది" (అబూ దావూద్: 3910, ఇబ్న్ మాజా: 3538). ఎందుకంటే, అల్లాహ్ మాత్రమే ఈ విశ్వాన్ని పరిపాలించేవాడని మరియు అగోచర జ్ఞానం తెలిసినవాడని ఒక ముస్లిం కలిగి ఉండవలసిన దృఢమైన విశ్వాసానికి ఇది విరుద్ధం అవుతుంది. అందుకే కేవలం ఏదైనా పక్షిని లేదా జంతువును చూడటం లేదా వాటి అరుపులు వినడం వల్ల కీడు జరుగుతుందని ఊహించడాన్ని మరియు నిరాశావాదాన్ని ఇస్లాం నిషేధించింది.

దీనికి విరుద్ధంగా ఇస్లాం ఆశావాదాన్ని, శుభం కలిగించే పదాలను ఎంచుకోవడాన్ని, మేలు జరుగుతుందనే ఆశను కలిగి ఉండటాన్ని మరియు అల్లాహ్ పట్ల సానుకూల భావనతో ఉండటాన్ని ప్రోత్సహించింది. దైవప్రవక్త ముహమ్మద్(స) వారు ఇలా సెలవిచ్చారు: "నాకు శుభశకునం (నేక్ ఫాలీ) అంటే ఇష్టం; అది మంచి మాట, పవిత్రమైన మాట" (బుఖారీ: 5776, ముస్లిం: 2224).

మీరు విజయవంతంగా మీ పాఠాలను పూర్తి చేశారు


పరీక్ష మొదలుపెట్టండి