నేర్చుకుంటూ ఉండండి

మీరు లాగిన్ కాలేదు
మీ పురోగతిని తెలుసుకోవడానికి మరియు పాయింట్లను సేకరించి పోటీల్లోకి ప్రవేశించడానికి ‘త’ వేదికలో ఇప్పుడే నమోదు చేయండి, నమోదు తర్వాత మీరు నేర్చుకున్న అంశాల ఎలక్ట్రానిక్ సర్టిఫికెట్ మీకు లభిస్తుంది.

ప్రస్తుత విభాగం : model

పాఠం మరణించిన వారి కొరకు నమాజు (జనాజా నమాజు) చదవడం మరియు వారిని ఖననం చేయడం.

మరణించిన ముస్లిము కొరకు నమాజు (జనాజా నమాజు) నిర్వహించడం అనేది ఇతర ముస్లిం సోదరులపై ఉన్న బాధ్యతలలో ఒకటి. ఇస్లాంలో ముస్లిమును గౌరవించే పద్ధతులలో ఇది కూడా ఒక భాగం. ఈ పాఠంలో మీరు జనాజా నమాజు మరియు దఫన్ (ఖననం)కు సంబంధించిన కొన్ని నియమాలను తెలుసుకుంటారు.

  • జనాజా నమాజు చేసే విధానాన్ని తెలుసుకోవడం.
  • ఖననం (దఫన్)కు సంబంధించిన కొన్ని నియమాలను తెలుసుకోవడం.

జనాజా నమాజు యొక్క విధి:

జనాజా నమాజు అక్కడ హాజరైన ముస్లిములందరిపై విడివిడిగా కాకుండా, అందరి తరపున సామూహికంగా విధిగా ఉంటుంది. కాబట్టి ఇది ఫర్దె కిఫాయ (సామూహిక బాధ్యత). దీని ప్రకారం, కొందరు కలిసి ఆ నమాజును చదివితే మిగిలిన వారిపై నుండి ఆ బాధ్యత మరియు పాపం తొలగిపోతాయి. జనాజా నమాజు చదివిన వారికి ఒక పెద్ద పర్వతమంత పుణ్యం దక్కుతుందని ప్రవక్త ముహమ్మద్ (స) వారు శుభవార్తనిస్తూ ఇలా సెలవిచ్చారు: "ఎవరైతే జనాజాలో పాల్గొని, నమాజు పూర్తయ్యే వరకు ఉంటారో వారికి ఒక 'ఖీరాత్' పుణ్యం లభిస్తుంది. ఎవరైతే ఖననం (దఫన్) పూర్తయ్యే వరకు ఉంటారో వారికి రెండు 'ఖీరాత్'ల పుణ్యం లభిస్తుంది." అప్పుడు "రెండు ఖీరాత్‌లు అంటే ఏమిటి?" అని అడగగా, "రెండు పెద్ద పర్వతాల వంటివి" అని వారు(స)సమాధానమిచ్చారు (బుఖారీ 1325, ముస్లిం 945).

జనాజాలో పాల్గొనడం వల్ల కలిగే పుణ్యం.

జనాజాలో పాల్గొనడం మరియు దానిని అనుసరించడం (వెళ్ళడం) వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి, వాటిలో ముఖ్యమైనవి: నమాజు నిర్వహించడం ద్వారా మరణించిన వ్యక్తి పట్ల గల బాధ్యతను నెరవేర్చడం, వారి కోసం సిఫారసు చేయడం మరియు దుఆ చేయడం; వారి కుటుంబ సభ్యుల పట్ల గల బాధ్యతను తీర్చడం మరియు ఆ విపత్తు సమయంలో వారికి మనోధైర్యాన్ని కలిగించడం; జనాజాతో వెళ్ళే వ్యక్తి గొప్ప పుణ్యాన్ని పొందడం; మరియు జనాజాలను, స్మశానాలను చూడటం ద్వారా హితబోధ మరియు గుణపాఠం కలగడం మొదలైనవి.

జనాజా నమాజు చేసే విధానం

1. జనాజా నమాజును సామూహికంగా (జమాత్ తో) నిర్వహించడం శ్రేయస్కరం. సాధారణ నమాజులలో వలెనే, ఇందువల కూడా ఇమామ్ ముక్తదీల (అనుసరించేవారి) కంటే ముందు నిలబడాలి.

2. మృతదేహాన్ని నమాజు చేసేవారికీ మరియు ఖిబ్లాకూ మధ్య ఉంచాలి. దైవప్రవక్త ముహమ్మద్(స) వారు సెలవిచ్చినట్లుగా, పురుషుడైతే అతని తల వద్ద, అదే స్త్రీ అయితే ఆమె శరీర మధ్య భాగం వద్ద ఇమామ్ నిలబడాలి (అబూ దావూద్ 3194).

.3. జనాజా నమాజు నాలుగు తక్బీర్లతో ఉంటుంది, దాని వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:

-

మొదటి తక్బీర్

నమాజు చేసే వ్యక్తి తన రెండు చేతులను భుజాల వరకు లేదా చెవుల పైభాగం వరకు ఎత్తుతూ మొదటి తక్బీర్ చెప్పాలి. తరువాత తన కుడి చేతిని ఎడమ అరచేతి వెనుక భాగంపై ఉంచి, రొమ్ముపై పెట్టుకోవాలి. ఇందులో సనా (ప్రారంభ దుఆ) చదవవలసిన అవసరం లేదు. అనంతరం అఊదుబిల్లాహ్, బిస్మిల్లాహ్ చదివి, సూరహ్ అల్ ఫాతిహాను నిశ్శబ్దంగా పఠించాలి.

రెండవ తక్బీర్

తరువాత రెండవ తక్బీర్ చెప్పాలి. దీని తరువాత దైవప్రవక్త ముహమ్మద్(స) వారిపై ఏదైనా ఒక రూపంలో దరూద్ పఠించాలి. ఉదాహరణకు: "అల్లాహుమ్మ సల్లి వ సల్లిమ్ అలా నబియ్యినా ముహమ్మద్" (ఓ అల్లాహ్! మా ప్రవక్త ముహమ్మద్(స) వారిపై నీ శుభాలను, శాంతిని వర్షించు)అని చెప్పవచ్చు. అయితే నమాజులో చివరి తషహ్హుద్‌లో పఠించే దరూద్ ఎ ఇబ్రాహీంను పఠించడం అత్యుత్తమమైన పద్ధతి. అది ఈ విధంగా ఉంటుంది: (అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మదిన్ వ అలా ఆలి ముహమ్మదిన్ కమా సల్లయ్త అలా ఇబ్రాహీమ వ అలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదుమ్మజీద్. అల్లాహుమ్మ బారిక్ అలా ముహమ్మదిన్ వ అలా ఆలి ముహమ్మదిన్ కమా బారక్త అలా ఇబ్రాహీమ వ అలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదుమ్మజీద్).

మూడవ తక్బీర్

తరువాత మూడవ తక్బీర్ చెప్పాలి. దీని తరువాత మృతుని కొరకు కారుణ్యం, పాపక్షమాపణ, స్వర్గప్రాప్తి మరియు ఉన్నత స్థానాలకై అల్లాహ్ తన హృదయానికి మరియు నాలుకకు స్ఫురింపజేసిన విధంగా దుఆ చేయాలి. ఈ సందర్భంలో దైవప్రవక్త ముహమ్మద్(స) వారు సెలవిచ్చిన కొన్ని దుఆలు గనుక నోటికి వచ్చి ఉంటే, వాటిని పఠించడం మరింత శ్రేయస్కరం.

ఆధారాలలో ఉన్న అటువంటి దుఆలలో ఒకటి: అల్లాహుమ్మగ్ ఫిర్ లహు, వర్ హంహు వ ఆఫిహి, వ అఫ్ఉ అన్ హు, వ అకరిమ్ నుజులహు, వవస్సి ముద్ ఖలహు, వగ్ సిల్ హు, బిల్ మాయి వథ్థల్ జి, వల్ బరది, వనఖ్ఖిహి మినల్ ఖతాయా కమా యునఖ్ఖితథ్థౌబుల్ అబ్ యదు మినద్దనసి, వ అబ్ దిల్ హు, దారన్ ఖైరన్ మిన్ దారిహి, వ అహ్ లన్ ఖైరన్ మిన్ అహ్ లిహి, వ జౌజన్ ఖైరన్ మిన్ జౌజిహి, వ అద్ ఖిల్ హుల్ జన్నత వఖిహి ఫిత్నతల్ ఖబ్రి వ అజాబిన్నారి. "(ఓ అల్లాహ్! ఇతడిని క్షమించు, ఇతనిపై కారుణ్యం కురిపించు, ఇతడికి క్షేమాన్ని ప్రసాదించు, ఇతని పొరపాట్లను మన్నించు, ఇతని ఆతిథ్యాన్ని గౌరవప్రదంగా చేయు, ఇతని ప్రవేశ స్థానాన్ని (సమాధిని) విశాలం చేయు. ఇతడిని నీరు, మంచు మరియు వడగండ్లతో శుద్ధి చేయు. మురికి నుండి తెల్లని వస్త్రాన్ని శుభ్రపరిచినట్లుగా ఇతడిని పాపాల నుండి పవిత్రం చేయు. ఇతనికి తన ఇంటి కంటే మెరుగైన ఇంటిని, తన కుటుంబం కంటే మెరుగైన కుటుంబాన్ని, తన జీవిత భాగస్వామి కంటే మెరుగైన భాగస్వామిని ప్రసాదించు. ఇతడిని స్వర్గంలో ప్రవేశింపజేయు మరియు సమాధి శిక్ష నుండి, నరకాగ్ని శిక్ష నుండి రక్షణ కల్పించు) (ముస్లిం 963).

నాల్గవ తక్బీర్

తరువాత నాలుగవ తక్బీర్ చెప్పాలి. దీని తరువాత కొద్దిసేపు ఆగి, కేవలం కుడి వైపుకు మాత్రమే సలామ్ చేయాలి.

జనాజా నమాజు నిర్వహించే ప్రదేశం :

జనాజా నమాజు ను మసీదులో గానీ, లేదా మసీదు బయట దాని కోసం కేటాయించిన ప్రత్యేక స్థలంలో గానీ నిర్వహించవచ్చు. అలాగే దీనిని స్మశానంలో కూడా నిర్వహించవచ్చు. ఇవన్నీ దైవప్రవక్త ముహమ్మద్(స) వారి ద్వారా నిరూపించబడ్డాయి.

మృతదేహాన్ని మోయడం మరియు అంతిమయాత్రలో పాల్గొనడం

జనాజాను సిద్ధం చేయడంలో, నమాజు నిర్వహించడంలో, స్మశానానికి తీసుకువెళ్ళడంలో మరియు ఖననం చేయడంలో త్వరితగతిన వ్యవహరించడం సున్నత్. అబూ హురైరా (ర) వారు ఉల్లేఖించిన దాని ప్రకారం, దైవప్రవక్త ముహమ్మద్(స) వారు ఇలా సెలవిచ్చారు: "మీరు జనాజాను త్వరగా (ఖననం కోసం) తీసుకువెళ్ళండి. ఒకవేళ ఆ మృతదేహం పుణ్యాత్ముడిదైతే, మీరు అతడిని మేలు వైపునకు త్వరగా చేర్చినవారవుతారు. ఒకవేళ అలా కాకుండా ఉంటే, మీ భుజాల మీద నుండి ఒక చెడును త్వరగా దించినవారవుతారు." (ముస్లిం 944, బుఖారీ 1315).

జనాజా (అంతిమయాత్ర)లో పాల్గొనేవారు మృతదేహాన్ని మోయడంలో పాలుపంచుకోవడం ఉత్తమం. మృతదేహాన్ని కేవలం పురుషులు మాత్రమే మోయాలి, మహిళలు కాదు. నడిచి వెళ్లేవారు జనాజాకు ముందు మరియు వెనుక ఉండటం సున్నత్. ఒకవేళ స్మశానం దూరంగా ఉన్నా లేదా మోయడం కష్టమనిపించినా, వాహనం లేదా కారులో తీసుకువెళ్లడంలో ఎటువంటి అభ్యంతరం లేదు.

మృతదేహాన్ని ఖననం చేసేటప్పుడు పాటించవలసిన అంశాలు:

١
మృతదేహానికి స్నానం (గుస్ల్) చేయించి, కఫన్ తొడిగి, నమాజు నిర్వహించిన తర్వాత ఖననం చేయడంలో త్వరితగతిన వ్యవహరించడం ఉత్తమం.
٢
అవసరాన్ని బట్టి సమాధిని లోతుగా మరియు వెడల్పుగా తవ్వడం వాంఛనీయం. కనీసం దుర్వాసన రాకుండా, క్రూర మృగాలు తవ్వకుండా మరియు వర్షపు నీటి ప్రవాహానికి సమాధి లేదా మృతదేహం కొట్టుకుపోకుండా ఉండేంత లోతుగా ఉండాలి.
٣
సమాధిని 'లహద్' (సమాధి లోపల కింద వైపునకు తవ్వే అర) రూపంలో గానీ లేదా 'షఖ్' (సమాధి మధ్యలో తవ్వే గొయ్యి) రూపంలో గానీ నిర్మించవచ్చు. నేల స్వభావాన్ని మరియు గట్టిదనాన్ని బట్టి ఆయా ప్రాంతాలకు అనువైన పద్ధతిని పాటించవచ్చు.
٤
మృతదేహాన్ని కుడి పక్కకు వాల్చి, ముఖాన్ని ఖిబ్లా వైపునకు ఉంచడం ఉత్తమం.
٥
మృతదేహాన్ని సమాధిలో ఉంచేటప్పుడు ఖననం చేసేవారు "బిస్మిల్లాహి వబిల్లాహి, వ అలా మిల్లతి రసూలిల్లాహ్(అల్లాహ్ నామముతో, అల్లాహ్ సాక్షిగా మరియు దైవప్రవక్త ముహమ్మద్(స) వారి మార్గమున - ఈ మృతదేహాన్ని సమర్పిస్తున్నాను)" అని చదవడం ఉత్తమం. (తిర్మిదీ 1046, ఇబ్న్ మాజా 1550).
١
మృతదేహంపై మట్టిని పోయడం ప్రారంభించడానికి ముందే, అది 'లహద్' (సమాధి లోపల కింద వైపునకు తవ్వే అర) అయినా లేదా 'షఖ్' (సమాధి మధ్యలో తవ్వే గొయ్యి) అయినా, ఆ మృతదేహం ఉన్న భాగాన్ని పచ్చి ఇటుకలు (మట్టి మరియు గడ్డితో తయారు చేసి ఎండబెట్టినవి) లేదా వెదురు బద్దలు లేదా రాళ్లు లేదా అటువంటి ఇతర వస్తువులతో కప్పాలి.
٢
అక్కడ ఉన్నవారు మృతదేహంపై మట్టి వేయడంలో పాలుపంచుకోవడం ఉత్తమం. దైవప్రవక్త ముహమ్మద్(స) వారు ఒక మృతుని సమాధిపై తమ చేతులతో మూడు దోసిళ్ల మట్టిని వేశారు. (దారఖుత్నీ 1565).
٣
సమాధిని గుర్తించడానికి వీలుగా దానిని నేల మట్టం నుండి సుమారు ఒక జానెడు ఎత్తు వరకు పెంచడం ఉత్తమం. దీనివల్ల ప్రజలు దానిపై నడవకుండా లేదా దానిని అగౌరవపరచకుండా దూరంగా ఉంటారు. అయితే సమాధులపై కట్టడాలు నిర్మించి మరీ ఎత్తుగా చేయడం నిషిద్ధం. ఇలా చేయకూడదని నిషేధాజ్ఞలు వచ్చాయి; ఎందుకంటే ఇది మృతుడిని అతిగా గౌరవించడానికి మరియు అల్లాహ్‌కు భాగస్వాములను కల్పించడానికి (షిర్క్) దారితీస్తుంది.

ఖననం చేసిన తర్వాత:

ఖనన ప్రక్రియలో పాల్గొన్నవారు, అది పూర్తయిన తర్వాత మృతుని కొరకు పాపక్షమాపణ (మగ్ఫిరత్) మరియు స్థిరత్వం ప్రసాదించమని దుఆ చేయడం ఉత్తమం. దైవప్రవక్త ముహమ్మద్(స) వారు మృతదేహాన్ని ఖననం చేసిన తర్వాత అక్కడ నిలబడి ఇలా సెలవిచ్చారు: "మీ సోదరుని కొరకు పాపక్షమాపణ వేడుకోండి మరియు అతడు స్థిరంగా ఉండేలా అల్లాహ్ ను ప్రార్థించండి, ఎందుకంటే ఇప్పుడు అతడు ప్రశ్నించబడుతున్నాడు." (అబూ దావూద్ 3221).

మీరు విజయవంతంగా మీ పాఠాలను పూర్తి చేశారు


పరీక్ష మొదలుపెట్టండి