ప్రస్తుత విభాగం : model
పాఠం పవిత్ర ఖుర్ఆన్ యొక్క శ్రేష్ఠతలు:
పవిత్ర ఖుర్ఆన్కు సంబంధించి అనేక గొప్ప శ్రేష్ఠతలు ఉన్నాయి, వాటిలో కొన్ని ఈ క్రింది విధంగా ఉన్నాయి:
ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ (ర) వారు దైవప్రవక్త ముహమ్మద్(స) వారి ద్వారా నివేదించిన కథనం ప్రకారం, వారు సెలవిచ్చారు: “మీలో ఉత్తములు ఎవరంటే, ఖుర్ఆన్ను నేర్చుకొని ఇతరులకు నేర్పేవారు.” (బుఖారీ: 5027).
అనస్ బిన్ మాలిక్ (ర) వారు దైవప్రవక్త ముహమ్మద్(స) వారి ద్వారా నివేదించిన కథనం ప్రకారం, వారు సెలవిచ్చారు: “నిశ్చయంగా మానవులలో అల్లాహ్ కు అత్యంత సన్నిహితులు (చెందినవారు) ఉన్నారు.” అందుకు సహచరులు, “ఓ అల్లాహ్ ప్రవక్త! వారు ఎవరు?” అని అడిగారు. అప్పుడు వారు, “వారే ఖుర్ఆన్ తో సంబంధం కలిగిన వారు, వారు అల్లాహ్ కు అత్యంత సన్నిహితులు మరియు ఆయన ప్రత్యేక దాసులు” అని సెలవిచ్చారు. (ఇబ్న్ మాజ: 215).
అబ్దుల్లాహ్ బిన్ మస్ఊద్ (ర) వారు నివేదించిన కథనం ప్రకారం, దైవప్రవక్త ముహమ్మద్(స) వారు సెలవిచ్చారు: "ఎవరైతే అల్లాహ్ గ్రంథం నుండి ఒక అక్షరాన్ని పఠిస్తారో, వారికి దానికి బదులుగా ఒక పుణ్యం లభిస్తుంది. ప్రతి పుణ్యం దానికి పది రెట్లు సమానం. నేను 'అలిఫ్-లామ్-మీమ్' ఒక అక్షరం అని చెప్పడం లేదు; కానీ 'అలిఫ్' ఒక అక్షరం, 'లామ్' ఒక అక్షరం మరియు 'మీమ్' ఒక అక్షరం." (తిర్మిదీ: 2910).
ఖుర్ఆన్ పఠనం మరియు అధ్యయనం జరిగే సభలపై దైవదూతలు, ప్రశాంతత మరియు కారుణ్యం అవతరిస్తాయి:
అబూ హురైరా (ర) వారు నివేదించిన కథనం ప్రకారం, దైవప్రవక్త ముహమ్మద్(స) వారు సెలవిచ్చారు: "ఏదైనా ఒక జనసమూహం అల్లాహ్ గృహాలలో (మసీదులలో) చేరి, అల్లాహ్ గ్రంథాన్ని పఠిస్తూ, దానిని పరస్పరం బోధించుకుంటే (నేర్చుకుంటే), వారిపై ప్రశాంతత అవతరిస్తుంది, కారుణ్యం వారిని కప్పివేస్తుంది, దైవదూతలు వారిని చుట్టుముడతారు మరియు అల్లాహ్ తన వద్ద ఉన్నవారిలో (దైవదూతల వద్ద) వారి గురించి ప్రస్తావిస్తాడు." (ముస్లిము: 2699).
5. ఖుర్ఆన్ తనను పఠించిన వారికి (అనుసరించిన వారికి) సిఫార్సు చేస్తుంది.
అబూ ఉమామా అల్-బాహిలీ (ర) వారు నివేదించిన కథనం ప్రకారం: నేను దైవప్రవక్త ముహమ్మద్(స) వారు ఇలా సెలవిస్తుండగా విన్నాను: "మీరు ఖుర్ఆన్ను పఠించండి, ఎందుకంటే అది ప్రళయ దినమున తనను పఠించిన వారి (అనుసరించిన వారి) పక్షాన సిఫార్సు చేయడానికి వస్తుంది." (ముస్లిము: 804).
ఆయిషా (ర) వారు నివేదించిన కథనం ప్రకారం, దైవప్రవక్త ముహమ్మద్(స) వారు సెలవిచ్చారు: "ఖుర్ఆన్ పఠనంలో ప్రావీణ్యం కలవారు గౌరవనీయులైన, పుణ్యాత్ములైన దైవదూతలతో కలిసి ఉంటారు. ఎవరైతే ఖుర్ఆన్ పఠిస్తున్నప్పుడు తడబడుతూ, ఎంతో శ్రమతో దానిని పఠిస్తారో, వారికి రెండు రెట్ల పుణ్యం లభిస్తుంది." (ముస్లిము: 798).
7. ఖుర్ఆన్ తనను అనుసరించేవారిని ఉన్నత స్థితికి చేర్చుతుంది.
ఉమర్ బిన్ ఖత్తాబ్ (ర) వారు నివేదించిన కథనం ప్రకారం, దైవప్రవక్త ముహమ్మద్(స) వారు సెలవిచ్చారు: "నిశ్చయంగా అల్లాహ్ ఈ ఖుర్ఆన్ ద్వారా కొన్ని జాతులను ఉన్నత స్థానాలకు హెచ్చిస్తాడు మరియు దీనిని నిర్లక్ష్యం చేసిన ఇతరులను అధోగతికి దిగజారుస్తాడు." (ముస్లిము: 817).
అబ్దుల్లాహ్ బిన్ అమమ్ర్ బిన్ ఆస్ (ర) వారు నివేదించిన కథనం ప్రకారం, దైవప్రవక్త ముహమ్మద్(స) వారు సెలవిచ్చారు: "ఖుర్ఆన్ పఠించేవానితో (ప్రళయ దినమున) ఇలా అనబడుతుంది: 'నీవు పఠించుకుంటూ ఉన్నత స్థానాలకు చేరుకో, నీవు ఇహలోకంలో ఏ విధంగానైతే స్పష్టంగా, నిదానంగా పఠించేవాడివో అలాగే ఇక్కడా పఠించు. నిశ్చయంగా నీవు పఠించే చివరి ఆయతు వద్దే నీ నివాస స్థానం (స్థాయి) ఉంటుంది'." (అబూ దావూద్: 1464).
ఖుర్ఆన్ పఠించిన వారు ప్రళయ దినమున గౌరవ వస్త్రాన్ని మరియు గౌరవ కిరీటాన్ని ధరింపజేయబడతారు.
అబూ హురైరా (ర) వారు నివేదించిన కథనం ప్రకారం, దైవప్రవక్త ముహమ్మద్(స) వారు సెలవిచ్చారు: "ప్రళయ దినమున ఖుర్ఆన్ వచ్చి ఇలా వేడుకుంటుంది: 'ఓ నా ప్రభూ! ఇతనికి (ఖుర్ఆన్ పఠించిన వానికి) ఆభరణాలను ధరింపజేయి', అప్పుడు అతనికి గౌరవ కిరీటం ధరింపజేయబడుతుంది. ఆ తర్వాత అది, 'ఓ నా ప్రభూ! ఇతనికి ఇంకా ప్రసాదించు' అని అడుగుతుంది, అప్పుడు అతనికి గౌరవ వస్త్రం ధరింపజేయబడుతుంది. ఆ తర్వాత అది, 'ఓ నా ప్రభూ! ఇతనిపై నీవు ప్రసన్నుడవు కావాలి' అని వేడుకుంటుంది, అప్పుడు అల్లాహ్ అతనిపై ప్రసన్నుడవుతాడు. ఆపై అతనితో ఇలా అనబడుతుంది: 'నీవు పఠిస్తూ ఉన్నత స్థానాలకు చేరుకో', మరియు ప్రతి ఆయతుకు బదులుగా అతనికి ఒక పుణ్యం అదనంగా ఇవ్వబడుతుంది." (తిర్మిదీ: 2915).
అల్లాహ్ ఖుర్ఆన్ పఠించిన వారి తల్లిదండ్రులను అనేక రకాల గొప్ప గౌరవ మర్యాదలతో సత్కరిస్తాడు.
సహల్ బిన్ ముఆద్ (ర) వారు తమ తండ్రి ద్వారా నివేదించిన కథనం ప్రకారం, దైవప్రవక్త ముహమ్మద్(స) వారు సెలవిచ్చారు: "ఎవరైతే ఖుర్ఆన్ను పఠించి, దానిలోని ఆదేశాల ప్రకారం ఆచరిస్తారో, ప్రళయ దినమున వారి తల్లిదండ్రులకు ఒక కిరీటం ధరింపజేయబడుతుంది. ఆ కిరీటం యొక్క కాంతి, మీ ఇహలోకపు ఇళ్లలో సూర్యుడు ఉంటే ఉండే కాంతి కంటే మిన్నగా ఉంటుంది. మరి దీనిని ఆచరించిన వ్యక్తికి లభించే ప్రతిఫలం గురించి మీ అభిప్రాయం ఏమిటి?" (అబూ దావూద్: 1453).
ఖుర్ఆన్ను నేర్చుకోవడం మరియు దానిని కంఠస్థం చేయడం అనేది ఈ ప్రపంచం మరియు అందులోని సమస్త సంపదల కంటే ఎంతో శ్రేష్ఠమైనది.
ఉక్బా బిన్ ఆమిర్ (ర) వారు ఇలా ఉల్లేఖించారు: మేము 'సుఫ్ఫా' (మసీదులోని ఒక వేదిక) వద్ద ఉన్నప్పుడు దైవప్రవక్త ముహమ్మద్(స) వారు బయటకు వచ్చి ఇలా సెలవిచ్చారు: "మీలో ఎవరైనా ప్రతిరోజూ ఉదయాన్నే 'బుత్హాన్' లేదా 'అఖీఖ్' ప్రాంతాలకు వెళ్లి, అక్కడ ఎటువంటి పాపానికి ఒడిగట్టకుండా మరియు బంధుత్వాలను తెంచుకోకుండా, పెద్ద మూపురాలు ఉన్న రెండు మేలురకము ఒంటెలను తీసుకురావాలని ఇష్టపడతారా?". అందుకు మేము, "ఓ దైవప్రవక్త! మేము దానిని ఇష్టపడతాము" అని మనవి చేశాము. అప్పుడు వారు ఇలా సెలవిచ్చారు: "మీలో ఎవరైనా మసీదుకు వెళ్లి అల్లాహ్ గ్రంథమైన ఖుర్ఆన్ నుండి రెండు ఆయతులు నేర్చుకోవడం లేదా పఠించడం అనేది అతనికి రెండు ఒంటెల కంటే ఉత్తమం. అలాగే మూడు ఆయతులు మూడు ఒంటెల కంటే, నాలుగు ఆయతులు నాలుగు ఒంటెల కంటే మరియు అదే సంఖ్యలో ఉన్న ఎన్ని ఒంటెల కంటేనైనా ఆ ఆయతులు పఠించడం ఎంతో శ్రేష్ఠమైనది." (ముస్లిం: 803)