నేర్చుకుంటూ ఉండండి

మీరు లాగిన్ కాలేదు
మీ పురోగతిని తెలుసుకోవడానికి మరియు పాయింట్లను సేకరించి పోటీల్లోకి ప్రవేశించడానికి ‘త’ వేదికలో ఇప్పుడే నమోదు చేయండి, నమోదు తర్వాత మీరు నేర్చుకున్న అంశాల ఎలక్ట్రానిక్ సర్టిఫికెట్ మీకు లభిస్తుంది.

ప్రస్తుత విభాగం : model

పాఠం పవిత్ర మదీనా నగర సందర్శన

పవిత్ర మక్కా నగరం తరువాత ప్రవక్త (స) వారి పట్టణం అయిన మదీనా నగరం అనేది ఈ భూమిపై ఉన్న పవిత్రమైన ప్రాంతము. ఈ పాఠములో దీని విశిష్ఠతలు మరియు దాని మర్యాదల గురించి తెలుసుకుందాము.

  • మదీనా నగరం యొక్క విశిష్టతలను తెలుసుకోవడం.
  • మదీనా నగరాన్ని సందర్శించేటప్పుడు పాటించవలసిన నియమాలను (ఆదాబ్) తెలుసుకోవడం.

పవిత్ర మదీనా నగరం యొక్క విశిష్టతలు

దైవప్రవక్త ముహమ్మద్(స) వారు మదీనా నగరానికి హిజ్రత్ (వలస) చేయడంతో ఆ పవిత్ర నగరానికి ఎంతో గౌరవం, గొప్పతనం చేకూరినవి. పవిత్ర మక్కా తరువాత భూమిపై ఉన్న అన్ని ప్రాంతాల కంటే మదీనా నగరం శ్రేష్ఠమైనది. దీని సందర్శన ఎల్లప్పుడూ అనుమతించబడినది మరియు దీనికి హజ్ యాత్రతో ఎటువంటి సంబంధం లేదు. దైవప్రవక్త ముహమ్మద్(స) వారు ఇలా సెలవిచ్చారు: "కేవలం మూడు మసీదుల సందర్శనార్థం మాత్రమే (ప్రయాణ భారాలను మోస్తూ) ప్రత్యేకంగా ప్రయాణాలు చేయాలి: అవి మస్జిద్ అల్-హరామ్, నా ఈ మసీదు (మస్జిద్ అన్-నబవీ) మరియు మస్జిద్ అల్-అఖ్సా" (బుఖారీ: 1189, ముస్లిం: 1397). మదీనా నగరానికి అనేక విశిష్టతలు ఉన్నాయి, వాటిలో కొన్ని:

1. ఆ నగరంలో ప్రవక్త(స) వారి మసీదు

దైవప్రవక్త ముహమ్మద్(స) వారు మదీనాకు చేరుకున్న తర్వాత మొట్టమొదటగా చేసిన పని మస్జిద్ అన్-నబవీ నిర్మాణం. ఇది ప్రజల మధ్య జ్ఞానానికి, ధర్మ ప్రచారానికి (దావా) మరియు శుభాలను వ్యాప్తి చేయడానికి ఒక కేంద్రంగా మారింది. ఈ పవిత్ర మసీదుకు ఎంతో గొప్ప విశిష్టత ఉంది, దైవప్రవక్త ముహమ్మద్(స) వారు ఇలా సెలవిచ్చారు: "నా ఈ మసీదులో చేసే ఒక నమాజు, మస్జిద్ అల్-హరామ్ మినహా మిగిలిన ఇతర మసీదులలో చేసే వెయ్యి నమాజుల కంటే ఉత్తమమైనది" (బుఖారీ 1190, ముస్లిం 1394).

2. అది సురక్షితమైన పవిత్ర స్థలం (హరమ్)గా ఉండటం:

అల్లాహ్ వహీ (దివ్యవాణి) ద్వారా దైవప్రవక్త ముహమ్మద్(స) వారు మదీనాను పవిత్ర స్థలం (హరమ్)గా ప్రకటించారు. కాబట్టి అక్కడ రక్తం చిందించకూడదు, ఆయుధాలు ధరించకూడదు, ఎవరినీ భయభ్రాంతులకు గురిచేయకూడదు, చెట్లను నరకకూడదు మరియు హరమ్ నిషేధాలలో ఉన్న ఇతర కార్యాలను చేయకూడదు. దైవప్రవక్త ముహమ్మద్(స) వారు ఇలా సెలవిచ్చారు: "అక్కడి పచ్చగడ్డిని కోయకూడదు, అక్కడి వేట జంతువులను బెదిరించకూడదు, పడి ఉన్న వస్తువులను (యజమానికి) ప్రకటించే ఉద్దేశంతో తప్ప ఎవరూ తీసుకోకూడదు, పశువుల మేత కోసం తప్ప ఎవరూ చెట్లను నరకకూడదు మరియు యుద్ధం కోసం అక్కడ ఆయుధాలు ధరించకూడదు" (అబూ దావూద్ 2035, అహ్మద్ 959).

3. అక్కడి ఉపాధిలో, పండ్లలో మరియు జీవనంలో శుభాలు (బర్కత్) ఉండటం:

దైవప్రవక్త ముహమ్మద్(స) వారు ఇలా దుఆ చేశారు: "ఓ అల్లాహ్! మా పండ్లలో మాకు శుభాలను ప్రసాదించు, మా నగరంలో (మదీనాలో) మాకు శుభాలను ప్రసాదించు, మా యొక్క ‘సా’ (కొలత పాత్ర)లో మాకు శుభాలను ప్రసాదించు మరియు మా ముద్దు (చిన్న కొలత పాత్ర)లో మాకు శుభాలను ప్రసాదించు. ఓ అల్లాహ్! నిశ్చయంగా ఇబ్రాహీం నీ దాసుడు, నీ మిత్రుడు (ఖలీల్) మరియు నీ ప్రవక్త. నేను కూడా నీ దాసుడను మరియు నీ ప్రవక్తను. వారు మక్కా కోసం నిన్ను ప్రార్థించారు, నేను మదీనా కోసం, వారు మక్కా కోసం ప్రార్థించిన దాని కంటే రెండింతలు ఎక్కువగా నిన్ను వేడుకుంటున్నాను" (ముస్లిం 1373).

4. అల్లాహ్ ఈ నగరాన్ని ప్లేగు వ్యాధి (తావూన్) మరియు దజ్జాల్ నుండి రక్షించడం:

దైవప్రవక్త ముహమ్మద్(స) వారు ఇలా సెలవిచ్చారు: "మదీనా నగర ద్వారాల వద్ద దైవదూతలు కాపలా ఉంటారు. దానిలోకి ప్లేగు వ్యాధి కానీ, దజ్జాల్ కానీ ప్రవేశించలేరు" (బుఖారీ 1880, ముస్లిం 1379).

5. మదీనాలో నివసించడం, జీవించడం మరియు అక్కడ మరణించడం యొక్క విశిష్టత:

మదీనా నగరంలోని కష్టాలను మరియు అక్కడి జీవన ఇబ్బందులను ఓర్చుకుని సహనం వహించిన వారికి దైవప్రవక్త ముహమ్మద్(స) వారు ప్రళయ దినమున సిఫారసు (షఫాఅత్) చేస్తానని వాగ్దానం చేశారు. సఅద్ బిన్ అబీ వక్కాస్(ర) వారు ఉల్లేఖించిన దాని ప్రకారం, దైవప్రవక్త ముహమ్మద్(స) వారు ఇలా సెలవిచ్చారు: "మదీనా నగరం వారికి ఎంతో మేలైనది, వారు తెలుసుకోగలిగితే! దానిపై అయిష్టతతో ఎవరైనా ఈ నగరాన్ని విడిచి వెళ్తే, అల్లాహ్ అతని కంటే ఉత్తమమైన వ్యక్తిని అక్కడ నివసింపజేస్తాడు. ఎవరైతే అక్కడి కష్టనష్టాలను ఓర్చుకుని స్థిరంగా ఉంటారో, వారికి ప్రళయ దినమున నేను తప్పకుండా సిఫారసు చేస్తాను లేదా సాక్షిగా ఉంటాను" (ముస్లిం 1363).

దైవప్రవక్త ముహమ్మద్(స) వారు ఇలా సెలవిచ్చారు: "ఎవరైనా మదీనాలో మరణించగలిగే స్థితిలో ఉంటే, వారు అక్కడే మరణించనీ (అంటే చివరి శ్వాస వరకు అక్కడే నివసించనీ). ఎందుకంటే మదీనాలో మరణించిన వారికి నేను నిశ్చయంగా సిఫారసు చేస్తాను" (తిర్మిది 3917, ఇబ్న్ మాజా 3112).

6. మదీనా నగరం విశ్వాసానికి (ఈమాన్) నిలయంగా ఉండటం మరియు తనలోని కల్మషాన్ని, చెడును దూరం చేయడం:

దేశాలు ఎంతగా ఇబ్బందులకు గురైనా విశ్వాసం (ఈమాన్) చివరకు మదీనా నగరానికే చేరుకుంటుంది. కల్మషం కలిగిన వారు మరియు దుర్మార్గులు అక్కడ స్థిరంగా ఉండలేరు. దైవప్రవక్త ముహమ్మద్(స) వారు ఇలా సెలవిచ్చారు: "పాము తన పుట్టలోకి ఏ విధంగా చేరుకుంటుందో, అదే విధంగా విశ్వాసం (ఈమాన్) కూడా మదీనా నగరానికి చేరుకుంటుంది" (బుఖారీ 1876, ముస్లిం 147). మరియు వారు ఇలా సెలవిచ్చారు: "ఎవరి చేతిలో అయితే నా ప్రాణం ఉందో ఆ అల్లాహ్ సాక్షిగా! ఎవరైనా మదీనా నగరంపై అయిష్టతతో దాని నుండి వెలుపలికి వెళ్తే, అల్లాహ్ అతని స్థానంలో అతని కంటే ఉత్తమమైన వ్యక్తిని అక్కడ నియమిస్తాడు. వినండి! నిశ్చయంగా మదీనా నగరం కొలిమి వంటిది; అది కల్మషాన్ని బయటకు పంపివేస్తుంది. మదీనా నగరం తనలోని దుర్మార్గులను, కొలిమి ఇనుములోని మాలిన్యాన్ని ఏ విధంగానైతే దూరం చేస్తుందో అలా దూరం చేసే వరకు ప్రళయం సంభవించదు" (ముస్లిం 1381).

7. ఇది (మదీనా) పాపాలను మరియు అపరాధాలను వెలివేస్తుంది:

జైద్ బిన్ సాబిత్ (ర) వారు పేర్కొన్నారు: దైవప్రవక్త ముహమ్మద్(స) వారు ఇలా సెలవిచ్చారు: "నిశ్చయంగా ఇది (మదీనా) అత్యంత పవిత్రమైనది. అగ్ని వెండిలోని మాలిన్యాన్ని ఏ విధంగానైతే వేరు చేస్తుందో, ఇది కూడా అలాగే తనలోని కల్మషాన్ని బయటకు నెట్టివేస్తుంది" (బుఖారీ 4589, ముస్లిము 1384).

దైవప్రవక్త(స) నగరాన్ని (మదీనాను) సందర్శించేటప్పుడు పాటించవలసిన మర్యాదలు:

మదీనా సందర్శకులు పాటించవలసిన కొన్ని మర్యాదలు (ఆదాబ్):

1. మదీనాకు రావాలనుకునే వారు, తమ ప్రయాణంలో దైవప్రవక్త ముహమ్మద్(స) వారి మసీదు సందర్శనను మరియు దాని కొరకే ప్రయాణ సన్నద్ధతను లక్ష్యంగా పెట్టుకోవాలి తప్ప, ప్రవక్త వారి సమాధి సందర్శన కోసం కాదు; ఎందుకంటే దైవప్రవక్త ముహమ్మద్(స) వారు ఇలా సెలవిచ్చారు: "మూడు మసీదులకు తప్ప (పుణ్యం కోసం) ప్రత్యేకంగా ప్రయాణం చేయకూడదు: అవి మస్జిదుల్ హరామ్, దైవప్రవక్త ముహమ్మద్(స) వారి మసీదు (మస్జిదె నబవి) మరియు మస్జిదుల్ అఖ్సా" (బుఖారీ 1189, ముస్లిం 1397).

2. సందర్శకుడు మసీదుకు చేరుకున్నప్పుడు, కుడి కాలు ముందు ఉంచి ప్రవేశించడం సున్నత్. మరియు ఇలా వేడుకోవాలి: అల్లాహుమ్మఫ్ తహ్ లీ అబ్వాబ రహ్మతిక. 'ఓ అల్లాహ్! నా కొరకు నీ కారుణ్య ద్వారాలను తెరువు'. (ముస్లిము 713).

3. మసీదులో ప్రవేశించిన తరువాత రెండు రకాతుల తహీయతుల్ మస్జిద్ నమాజు చేయాలి. ఒకవేళ వీటిని ‘రౌదా’ లో చదివితే అది మరింత ఉత్తమం.

4. దైవప్రవక్త ముహమ్మద్(స) వారి సమాధిని మరియు వారి ఇరువురు సహచరుల (ర) సమాధులను సందర్శించడం సున్నత్. సందర్శకుడు ఎంతో వినమ్రతతో, స్వరాన్ని తగ్గించి, హుందాగా దైవప్రవక్త(స) వారి సమాధి వైపు నిలబడి ఇలా అనాలి: "అస్సలాము అలైక అయ్యూహన్ నబియ్యు వ రహ్మతుల్లాహి వ బరకాతుహు. మీరు నిశ్చయంగా అల్లాహ్ యొక్క సందేశహరులని, మీరు దైవ సందేశాన్ని సంపూర్ణంగా చేరవేశారని, మీకు అప్పగించిన బాధ్యతను (అమానత్) నెరవేర్చారని, సమాజానికి హితబోధ చేశారని మరియు అల్లాహ్ మార్గంలో చేయవలసిన విధంగా పోరాడారని నేను సాక్ష్యమిస్తున్నాను. అల్లాహ్ తన ప్రవక్తలలో ఒకరికి తన సమాజం (ఉమ్మత్) తరపున ఇచ్చే అత్యుత్తమ ప్రతిఫలాన్ని మీకు ప్రసాదించుగాక".

ఆ తరువాత తన కుడి వైపుకు ఒకటి లేదా రెండు అడుగులు వేసి, అబూ బకర్ (ర) వారి సమాధి ముందు నిలబడి, వారికి సలామ్ చేసి, వారి కొరకు అల్లాహ్ ప్రసన్నతను వేడుకోవాలి. ఆపై మరలా వారి కుడి వైపుకు ఒకటి లేదా రెండు అడుగులు వేసి, ఉమర్ (ర) వారి సమాధి ముందు నిలబడి, వారికి సలామ్ చేసి, వారి కొరకు అల్లాహ్ ప్రసన్నతను వేడుకోవాలి.

5. దైవప్రవక్త ముహమ్మద్(స) వారి మసీదులో అధికంగా నమాజులు నిర్వహించడం ఉత్తమం. తద్వారా దైవప్రవక్త ముహమ్మద్(స) వారు సెలవిచ్చిన ఈ గొప్ప ప్రతిఫలాన్ని పొందవచ్చు: "నా ఈ మసీదులో చేసే ఒక నమాజు, మస్జిదుల్ హరామ్ మినహా మిగిలిన ఇతర మసీదులలో చేసే వెయ్యి నమాజుల కంటే ఎంతో శ్రేష్ఠమైనది" (బుఖారీ 1190, ముస్లిము 1394).

6. మస్జిద్ ఖుబాలో నమాజు చేయడానికి దానిని సందర్శించడం సున్నత్. దీని గొప్పతనం గురించి దైవప్రవక్త ముహమ్మద్(స) వారు ఇలా సెలవిచ్చారు: "ఎవరు (తమ ఇంటి నుండి) బయలుదేరి ఈ మసీదుకు - అనగా మస్జిద్ ఖుబాకు - వచ్చి అందులో నమాజు చేస్తారో, వారికి ఒక ఉమ్రా చేసినంత పుణ్యం లభిస్తుంది" (నసాయి 699).

7. బఖీ సమాధులను మరియు ఉహుద్ అమరవీరుల (షుహదా) సమాధులను సందర్శించడం సున్నత్. ఎందుకంటే దైవప్రవక్త ముహమ్మద్(స) వారు ఆ ప్రదేశాలను సందర్శించి వారి కొరకు దుఆ చేసేవారు. సమాధుల వాసుల కొరకు వారు చేసే దుఆలలో ఇదీ ఒకటి: "అస్సలాము అలైకుమ్ అహలద్దీయారి మినల్ మొమినీన వల్ ముస్లిమీన, వ ఇన్నా ఇన్ షా అల్లాహు లలాహిఖూన్, అస్అలుల్లాహ లనా వ లకుముల్ ఆఫియహ్" (ముస్లిం 975). (భావం: ఓ సమాధుల వాసులైన విశ్వాసులారా మరియు ముస్లిములారా! మీపై శాంతి కలుగుగాక. అల్లాహ్ తాలిస్తే నిశ్చయంగా మేము కూడా మిమ్మల్ని వచ్చి కలుస్తాము. మా కొరకు మరియు మీ కొరకు నేను అల్లాహ్ తో క్షేమాన్ని వేడుకుంటున్నాను).

8. ప్రతి ముస్లిము ఈ నగరంలో అల్లాహ్ ఆజ్ఞలను పాటిస్తూ స్థిరంగా ఉండటానికి, అల్లాహ్ మరియు దైవప్రవక్త ముహమ్మద్(స) వారి విధేయతకు కట్టుబడి ఉండటానికి ప్రయత్నించాలి. అలాగే బిద్అత్ (ధర్మంలో లేని కొత్త విషయాలు) మరియు పాపకార్యాలకు పాల్పడకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి.

9. మదీనా నగరంలో చెట్లను నరకడం లేదా వేటాడటం వంటి పనులు చేయకూడదు; దీని గురించి దైవప్రవక్త ముహమ్మద్(స) వారి నుండి అనేక హదీసులు ఉల్లేఖించబడ్డాయి. దైవప్రవక్త ముహమ్మద్(స) వారు ఇలా సెలవిచ్చారు: "నిశ్చయంగా ఇబ్రాహీం(అ) మక్కాను పవిత్ర క్షేత్రంగా (హరమ్) ప్రకటించారు, నేను మదీనాలోని రెండు కొండల మధ్య ఉన్న ప్రాంతాన్ని పవిత్ర క్షేత్రంగా ప్రకటిస్తున్నాను. ఇక్కడ చెట్లను నరకకూడదు మరియు వేటాడకూడదు" (ముస్లిం 1362).

10 ఈ నగరంలో ఉన్నప్పుడు, ఇక్కడి నుండే దివ్య కాంతి ప్రసరించిందని మరియు ప్రయోజనకరమైన జ్ఞానం ప్రపంచం నలుమూలలకు విస్తరించిందని ప్రతి ముస్లిము గుర్తించాలి. కాబట్టి, అల్లాహ్ మార్గంలో వివేకంతో పయనించడానికి తోడ్పడే ధర్మ జ్ఞానాన్ని (ఇల్మ్ ఎ షరయీ) ఆర్జించడానికి కృషి చేయాలి. ముఖ్యంగా దైవప్రవక్త ముహమ్మద్(స) వారి మసీదులో జ్ఞాన సముపార్జన చేయడం గురించి అబూ హురైరా (ర) వారు ఇలా సెలవిచ్చారు: "ఎవరైతే ఏదైనా మంచిని నేర్చుకోవడానికి లేదా నేర్పించడానికి మా ఈ మసీదులో ప్రవేశిస్తారో, వారు అల్లాహ్ మార్గంలో పోరాడే యోధునితో (ముజాహిద్‌తో) సమానం. ఇది తప్ప వేరే ఇతర కారణం కోసం ప్రవేశించేవారు, తనకు సంబంధం లేని వస్తువులను చూసే వ్యక్తితో సమానం" (అహ్మద్ 10814, ఇబ్న్ హిబ్బాన్ 87).

మీరు విజయవంతంగా మీ పాఠాలను పూర్తి చేశారు


పరీక్ష మొదలుపెట్టండి