నేర్చుకుంటూ ఉండండి

మీరు లాగిన్ కాలేదు
మీ పురోగతిని తెలుసుకోవడానికి మరియు పాయింట్లను సేకరించి పోటీల్లోకి ప్రవేశించడానికి ‘త’ వేదికలో ఇప్పుడే నమోదు చేయండి, నమోదు తర్వాత మీరు నేర్చుకున్న అంశాల ఎలక్ట్రానిక్ సర్టిఫికెట్ మీకు లభిస్తుంది.

ప్రస్తుత విభాగం : model

పాఠం పవిత్ర ఖుర్ఆన్ పఠనానికి సంబంధించిన నియమాలు మరియు మర్యాదలు

పవిత్ర ఖుర్ఆన్ అల్లాహ్ యొక్క వాక్కు. దానిని పఠించేవారు పఠన నియమాలను మరియు మర్యాదలను తెలుసుకోవడం అనివార్యం. ఈ పాఠంలో మీరు అటువంటి కొన్ని నియమాలను మరియు మర్యాదలను నేర్చుకుంటారు.

పవిత్ర ఖుర్ఆన్ పఠనానికి సంబంధించిన నియమాలు మరియు మర్యాదలను (ఆదాబ్) గుర్తించడం.

ఖురాన్ కంఠస్థం చేయడం గురించిన నియమం

١
సంపూర్ణ పవిత్ర ఖుర్ఆన్‌ను కంఠస్థం చేయడం అనేది ముస్లిము సముదాయం (ఉమ్మత్)పై 'ఫర్దే కిఫాయా' (సామూహిక బాధ్యత) అని ఇస్లామీయ పండితుల ఏకాభిప్రాయం. ముస్లిములలో తగినంత మంది ఈ బాధ్యతను నెరవేర్చినట్లయితే, మిగిలిన వారిపై నుండి ఆ పాపం తొలగిపోతుంది.
٢
ప్రతి ముస్లిము తన నమాజు సక్రమంగా నెరవేరడానికి అవసరమైనంత మేరకు ఖుర్ఆన్‌ను కంఠస్థం చేయడం అనివార్యం (వాజిబ్). అదే పవిత్ర ఫాతిహా సూరా.
٣
ప్రతి ముస్లిము తనకు వీలైనంత వరకు ఖుర్ఆన్‌ను కంఠస్థం చేయడం మరియు ఆ విషయంలో నిరంతరం కృషి చేయడం ఉత్తమం (ముస్తహబ్). ఎందుకంటే పవిత్ర ఖుర్ఆన్‌ను కంఠస్థం చేయడంలో ఎంతో గొప్ప ప్రతిఫలం మరియు అపారమైన పుణ్యం దాగి ఉన్నాయి.

ఆయిషా (ర) వారు ఉల్లేఖించిన కథనం ప్రకారం దైవప్రవక్త ముహమ్మద్(స) వారు ఇలా సెలవిచ్చారు: "ఖుర్ఆన్‌ను కంఠస్థం చేసి, దానిని పఠించే వ్యక్తి (పరలోకంలో) గౌరవనీయులైన, పుణ్యాత్ములైన దైవదూతలతో కలిసి ఉంటారు." (బుఖారీ: 4937)

పవిత్ర ఖుర్ఆన్ పారాయణం చేయుటలోని ఆదేశం

ఒక ముస్లిము తన శక్తి సామర్థ్యాల మేరకు పవిత్ర ఖుర్ఆన్‌ను పారాయణం చేయడం మరియు దానిని అధికంగా చదవడం ఉత్తమం. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: "ఎవరైతే అల్లాహ్ గ్రంథాన్ని పారాయణం చేస్తారో, నమాజును స్థాపిస్తారో మరియు మేము వారికి ప్రసాదించిన దాని నుండి రహస్యంగానూ, బహిరంగంగానూ ఖర్చు చేస్తారో, వారు ఎన్నటికీ నష్టం వాటిల్లని వ్యాపారాన్ని ఆశిస్తున్నారు." [ఫాతిర్: 29].

ఖుర్ఆన్ పఠనాన్ని శ్రద్ధగా వినడం మరియు మౌనంగా ఉండటం గురించిన నియమం

ఫర్దు నమాజులలో మరియు జుమా ఖుత్బాలో పవిత్ర ఖుర్ఆన్ పఠనం జరుగుతున్నప్పుడు దానిని శ్రద్ధగా వినడం మరియు మౌనంగా ఉండటం ప్రతి ముస్లిముపై బాధ్యతగా ఉంది. ఎందుకంటే అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: "మరియు ఖుర్ఆన్ పఠించబడుతున్నప్పుడు దానిని శ్రద్ధగా వినండి మరియు మౌనంగా ఉండండి, తద్వారా మీరు కరుణించబడతారు." (అల్-ఆరాఫ్: 204).

ఇతర సమయాలలో కూడా పవిత్ర ఖుర్ఆన్ పఠనాన్ని శ్రద్ధగా వినడం మరియు మౌనంగా ఉండటం అభిలషణీయం (ముస్తహబ్). ఎందుకంటే ఇది అల్లాహ్ వాక్యాల పట్ల ప్రదర్శించవలసిన క్రమశిక్షణ మరియు గౌరవప్రదమైన చర్య.

పవిత్ర ఖుర్ఆన్ ఆదేశాల ప్రకారం జీవించడంలోని ధార్మిక విధి.

ప్రతి ఒక్కరూ పవిత్ర ఖుర్ఆన్ పట్ల విశ్వాసం కలిగి ఉండటం మరియు దాని నియమాలను పాటించడం తప్పనిసరి. అందులో అనుమతించబడిన వాటిని హలాల్‌గా, నిషేధించబడిన వాటిని హరామ్‌గా స్వీకరించాలి. దాని నిషేధాలను పాటిస్తూ, దాని ఆదేశాలను అనుసరిస్తూ జీవించాలి.

అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: "మేము ఎవరికైతే గ్రంథాన్ని ప్రసాదించామో, వారు దానిని పఠించవలసిన రీతిలో పఠిస్తున్నారు" (అల్-బఖరా: 121). ఇబ్న్ మసూద్(ర) వారు మరియు ఇబ్న్ అబ్బాస్(ర) వారు దీని గురించి ఇలా వివరించారు: "వారు దానిలోని హలాల్‌ను (అనుమతించబడినవి) హలాల్‌గా, హరామ్‌ను (నిషేధించబడినవి) హరామ్‌గా స్వీకరిస్తారు మరియు దానిలోని వాక్యాలను వాటి అసలు అర్థాల నుండి మార్చరు." (తఫ్సీర్ ఇబ్న్ కసీర్ 1/403).

అబ్దుల్లాహ్ బిన్ మసూద్(ర) వారు ఇలా ఉల్లేఖించారు: "మేము దైవప్రవక్త ముహమ్మద్(స) వారి నుండి పది ఖుర్ఆన్ ఆయతులు నేర్చుకున్నప్పుడు, వాటిలో ఉన్న విషయాలను గ్రహించే వరకు తదుపరి పది ఆయతులను నేర్చుకునేవారం కాదు." (అల్-హాకిమ్: 2047). ఇక్కడ "వాటిలో ఉన్న విషయాలు" అంటే, ఆ ఆయతులలో ఉన్న ఆదేశాల ప్రకారం ఆచరించడం అని ఈ హదీసు ఉల్లేఖీతలలో ఒకరు వివరించారు.

ఖుర్ఆన్ పఠనాన్ని క్రమం తప్పకుండా కొనసాగించడం మరియు దానిని విస్మరించకుండా ఉండటం.

ప్రతి ముస్లిము పవిత్ర ఖుర్ఆన్‌ను క్రమం తప్పకుండా పఠిస్తూ దానితో సంబంధాన్ని కలిగి ఉండాలి. ఖుర్ఆన్‌ను మరిచిపోకుండా మరియు దానిని విస్మరించకుండా ఉండటానికి, కనీసం కొంత భాగమైనా పఠించకుండా ఏ రోజూ గడవకూడదు. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: "మరియు దైవప్రవక్త ఇలా విన్నవించుకున్నారు: ఓ నా ప్రభూ! నిశ్చయంగా నా జాతి వారు ఈ ఖుర్ఆన్‌ను విస్మరించారు." (అల్-ఫుర్కాన్: 30).

అబూ మూసా(ర) వారు ఉల్లేఖించిన కథనం ప్రకారం, దైవప్రవక్త ముహమ్మద్(స) వారు ఇలా సెలవిచ్చారు: "మీరు ఖుర్ఆన్‌ను క్రమం తప్పకుండా పఠిస్తూ (దానితో సంబంధాన్ని) కాపాడుకోండి. ఎవరి చేతిలో అయితే నా ప్రాణం ఉందో ఆ అల్లాహ్ సాక్షిగా చెబుతున్నాను! కట్టివేయబడిన ఒంటె తన బంధనాల నుండి తప్పించుకోవడానికి ప్రయత్నించే దానికంటే వేగంగా, ఈ ఖుర్ఆన్ (పఠించని వారి హృదయాల నుండి) అంతకంటే వేగంగా జారిపోతుంది." (బుఖారీ: 5033).

పవిత్ర ఖుర్ఆన్ పఠనానికి సంబంధించిన మర్యాదలు.

పవిత్ర ఖుర్ఆన్ పఠనం ఆమోదయోగ్యం కావడానికి మరియు దానికి పుణ్యం లభించడానికి కొన్ని మర్యాదలను పాటించవలసి ఉంటుంది. ఆ మర్యాదలలో కొన్ని పఠనానికి ముందు పాటించవలసినవి కాగా, మరికొన్ని పఠనం సాగుతున్న సమయంలో పాటించవలసినవి.

పవిత్ర ఖుర్ఆన్ పఠనానికి ముందు పాటించవలసిన మర్యాదలు:

١
పవిత్ర ఖుర్ఆన్ పఠించేటప్పుడు అల్లాహ్ ప్రసన్నతను మరియు ఆయన పుణ్యాన్ని మాత్రమే ఆశించి, కేవలం ఆయన కోసమే నిష్కల్మషమైన మనస్సుతో (ఇఖ్లాస్) పఠించాలి. ఎందుకంటే అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: "మరియు వారు తమ ధర్మాన్ని కేవలం అల్లాహ్ కే అంకితం చేస్తూ, నిష్కల్మషమైన భక్తితో ఆయనను ఆరాధించాలని మాత్రమే ఆదేశించబడ్డారు." (అల్-బయ్యిన: 5). ఈ మర్యాద పఠనానికి ముందు ఉండటంతో పాటు, పఠనం సాగుతున్నంత సేపూ ఉండాలి.
٢
పెద్ద మరియు చిన్న అశుద్ధాల (హదసె అక్బర్ మరియు అస్గర్) నుండి పవిత్రతను (వుదూ మరియు స్నానం) కలిగి ఉండాలి. ఎందుకంటే అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: "పరిశుద్ధులు తప్ప దీనిని (ఖుర్ఆన్‌ను) ఎవరూ తాకరాదు." (అల్-వాఖియా: 79).
٣
నోటిని శుభ్రం చేసుకోవడానికి మిస్వాక్ (దంతధావనం) చేయాలి, తద్వారా నోరు సువాసనతో ఉంటుంది. ఎందుకంటే నోరు ఖుర్ఆన్ పఠనానికి మార్గం. హుదైఫా(ర) వారు ఇలా ఉల్లేఖించారు: "దైవప్రవక్త ముహమ్మద్(స) వారు రాత్రి వేళ తహజ్జుద్ నమాజు కోసం లేచినప్పుడు మిస్వాక్ తో తమ నోటిని శుభ్రం చేసుకునేవారు." (బుఖారీ: 1136 మరియు ముస్లిం: 255).
٤
పారాయణ చేసేటప్పుడు ఖిబ్లా దిశ వైపునకు ముఖం చేసి కూర్చోవాలి, ఎందుకంటే అది దిశలన్నింటిలోనూ అత్యంత గౌరవప్రదమైనది. అబూ హురైరా (రజియల్లాహు అన్హు) ఉల్లేఖించిన దాని ప్రకారం అల్లాహ్ ప్రవక్త (స) ఇలా సెలవిచ్చారు: "ప్రతి దానికీ ఒక నాయకుడు ఉంటాడు, సభలన్నింటిలోనూ శ్రేష్ఠమైనది ఖిబ్లా వైపునకు ముఖం చేసి కూర్చునే సభ." (దీనిని తబరానీ 2354 ఉల్లేఖించారు మరియు దీని ఇస్నాద్ 'హసన్' స్థాయికి చెందినది).
٥
ఇస్తిఆదా (అల్లాహ్ శరణు కోరడం): అల్లాహ్ ఈ విధంగా ఆజ్ఞాపించాడు: "నీవు ఖుర్ఆన్ పఠించడం ప్రారంభించినప్పుడు, శపించబడిన షైతాన్ నుండి అల్లాహ్ శరణు కోరుకో." (అన్ నహ్ల్: 98).
٦
ఏదైనా సూరా ఆరంభం నుండి పఠించేటప్పుడు 'బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం' అని చదవాలి. అనస్ (ర) వారు ఇలా ఉల్లేఖించారు: "ఒకరోజు దైవప్రవక్త ముహమ్మద్(స) వారు మా మధ్య ఉన్నప్పుడు, వారు కొద్దిసేపు కునుకు తీశారు. ఆ తర్వాత వారు చిరునవ్వు చిందిస్తూ తన శిరస్సును పైకెత్తారు. అప్పుడు మేము, 'ఓ అల్లాహ్ ప్రవక్తా! మిమ్మల్ని నవ్వించిన విషయం ఏమిటి?' అని అడిగాము. అందుకు వారు, 'ఇప్పుడే నాపై ఒక సూరా అవతరించింది' అని సెలవిచ్చారు." తర్వాత వారు బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం చదివి ఇలా పఠించారు: "నిశ్చయంగా మేము నీకు కౌసర్ (సరస్సును, మరెన్నో వరాల)ను ప్రసాదించాము. కాబట్టి నువ్వు నీ ప్రభువు కోసమే నమాజు చేయి, ఖుర్బానీ ఇవ్వు. ముమ్మాటికీ నీ శత్రువే నామరూపాల్లేకుండా పోయేవాడు. (అల్ కౌసర్: 1-3), ముస్లిము (400).

దివ్యఖుర్ఆన్ పఠించేటప్పుడు పాటించవలసిన మర్యాదలు:

١
ఖుర్ఆన్‌ను చక్కగా, నిదానంగా మరియు స్పష్టంగా పఠించాలి. అల్లాహ్ ఈ విధంగా సెలవిచ్చాడు: "ఖుర్ఆన్‌ను ఆగి ఆగి, స్పష్టంగా పఠించుము." (అల్ ముజ్జమ్మిల్: 4).
٢
ఖుర్ఆన్‌ను తజ్వీద్‌తో (ఉచ్ఛారణా నియమాలతో) పఠించాలి. దైవప్రవక్త ముహమ్మద్(స) వారి పఠన శైలి ఎలా ఉండేదని అనస్ (ర) వారిని అడగగా, వారు ఇలా సెలవిచ్చారు: "వారూ అక్షరాలను సాగదీస్తూ పఠించేవారు. ఆ తర్వాత వారు 'బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం' పఠించి చూపిస్తూ, 'బిస్మిల్లాహ్' లోని అల్లాహ్ శబ్దాన్ని, 'అర్రహ్మాన్' మరియు 'అర్రహీమ్' పదాలను సాగదీస్తూ పఠించారు." బుఖారీ (5046).
٣
పఠించేటప్పుడు స్వరాన్ని అందంగా మార్చుకోవాలి. బరా బిన్ ఆజిబ్ (ర) వారు ఇలా ఉల్లేఖించారు: దైవప్రవక్త ముహమ్మద్(స) వారు ఇలా సెలవిచ్చారు: "మీ స్వరాలతో ఖుర్ఆన్‌ను అలంకరించండి." అబూ దావూద్ (1468).
٤
కారుణ్యాన్ని ప్రసాదించే ఆయతులు (వచనాలు) వచ్చినప్పుడు అల్లాహ్‌ను వేడుకోవాలి, శిక్షకు సంబంధించిన ఆయతులు వచ్చినప్పుడు అల్లాహ్ శరణు కోరాలి మరియు అల్లాహ్ పవిత్రతను కొనియాడే ఆయతులు వచ్చినప్పుడు ఆయనను స్తుతించాలి. హుదైఫా (ర) వారు దైవప్రవక్త ముహమ్మద్(స) వారితో కలిసి చేసిన నమాజు గురించి ఉల్లేఖిస్తూ ఇలా సెలవిచ్చారు: "ఆ తర్వాత వారు సూరా ఆలె ఇమ్రాన్‌ను ప్రారంభించి పఠించారు. వారు చాలా నిదానంగా పఠిస్తున్నారు; పవిత్రతను చాటే ఆయతు వచ్చినప్పుడు వారు అల్లాహ్ పవిత్రతను కొనియాడారు (సుబ్'హానల్లాహ్ అన్నారు), ఏదైనా వేడుకోవలసిన సందర్భం వచ్చినప్పుడు వారు అల్లాహ్‌ను వేడుకున్నారు మరియు శరణు కోరవలసిన ఆయతు వచ్చినప్పుడు వారు అల్లాహ్ శరణు కోరారు." ముస్లిం (772).
٥
ఖుర్ఆన్ పఠనంలో సజ్దా వచ్చినప్పుడు సాష్టాంగం చేయడం ఉత్తమం. ఆయిషా (ర) వారు ఇలా ఉల్లేఖించారు: "దైవప్రవక్త ముహమ్మద్(స) వారు రాత్రి పూట ఖుర్ఆన్ పఠించేటప్పుడు సజ్దా వచ్చిన చోట పదేపదే ఇలా సెలవిచ్చేవారు: సజద వజ్ హియ లిల్లదీ ఖలకహూ వ షక్క సమ్అహూ వ బసరహూ బిహౌలిహీ వ ఖువ్వతిహీ. అర్ధం : ‘నా ముఖము తనను సృష్టించిన వానికి, తన శక్తి సామర్థ్యాలతో దానికి వినికిడి మరియు చూపును ప్రసాదించిన వానికే సాష్టాంగం చేస్తోంది'. అబూ దావూద్ (1414).
٦
దానిని పఠించేటప్పుడు ఖుషూ (ఏకాగ్రత), ప్రశాంతత మరియు గంభీరతను కలిగి ఉండాలి. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: "(ఓ ప్రవక్తా!) ఇది మేము నీపై అవతరింపజేసిన ఒక శుభప్రదమైన గ్రంథం, వారు దీని ఆయతులను గురించి ఆలోచించడానికీ మరియు బుద్ధిమంతులు దీని ద్వారా హితబోధ పొందడానికీ.[సాద్: 29].

మీరు విజయవంతంగా మీ పాఠాలను పూర్తి చేశారు


పరీక్ష మొదలుపెట్టండి