ప్రస్తుత విభాగం : model
పాఠం 2. దైవ ప్రవక్త (స) వారి జీవిత చరిత్ర
దైవప్రవక్త ముహమ్మద్(స) వారు ఇస్లామీయ ధర్మ సందేశంతో ప్రవక్తగా నియమించబడటం.
దైవప్రవక్త ముహమ్మద్(స) వారికి ప్రవక్తత్వపు ఆరంభం 'సత్యమైన కలల' ద్వారా మొదలైనది. వారు నిద్రలో ఏ కల కన్నా అది తెల్లవారుజాము సూర్యోదయం వలె స్పష్టంగా నిజమయ్యేది. ఇలా ఆరు నెలల పాటు జరిగిన తర్వాత వహీ (దైవసందేశం) ఆరంభమైనది.
దైవప్రవక్త ముహమ్మద్(స) వారి వయస్సు నలభై ఏళ్లకు చేరువైనప్పుడు, వారికి ఏకాంతం పట్ల ఆసక్తి కలిగింది. వారు రమదాన్ మాసాన్ని హీరా గుహలో గడుపుతూ, అక్కడ ఏకాంతంగా ఉంటూ అల్లాహ్ ను ఆరాధించేవారు. దైవప్రవక్త ముహమ్మద్(స) వారు మూడు సంవత్సరాల పాటు ఇదే విధంగా కొనసాగించారు, చివరకు అటువంటి ఒక ఏకాంత సమయంలోనే వారి వద్దకు వహీ (దైవసందేశం) వచ్చింది.
దైవప్రవక్త ముహమ్మద్(స) వారికి నలభై ఏళ్లు నిండినప్పుడు, వారిపై ప్రవక్తత్వపు కాంతి ప్రసరించింది. అల్లాహ్ తన సందేశంతో వారిని గౌరవించాడు మరియు తన సృష్టిరాశి వద్దకు ప్రవక్తగా పంపాడు. వారిని తన ప్రత్యేక గౌరవానికి పాత్రులుగా చేసి, తనకూ తన దాసులకూ మధ్య తన నమ్మకస్తుడిగా నియమించాడు. అప్పుడు జిబ్రయీల్(అ) వారు అల్లాహ్ ఆదేశంతో వారి వద్దకు వచ్చారు. అల్లాహ్ వారిని లోకవాసులందరి పట్ల కారుణ్యంగా, మానవాళి అందరికీ శుభవార్త వినిపించేవారుగా మరియు హెచ్చరించేవారుగా పంపాడు.
దైవప్రవక్త ముహమ్మద్(స) వారు, "ఓ వస్త్రం కప్పుకున్నవాడా! లేచి హెచ్చరించు" (సూరా అల్-ముద్దసిర్: 1-2) అని అల్లాహ్ తన సందేశాన్ని చేరవేయమని ఆదేశించినప్పటి నుండి, వెనువెంటనే ప్రజలను అల్లాహ్ ను మాత్రమే ఆరాధించమని మరియు అల్లాహ్ పంపిన ధర్మాన్ని స్వీకరించమని పిలుపునివ్వడం ప్రారంభించారు.
రహస్య ధర్మప్రచారం
దైవప్రవక్త ముహమ్మద్(స) వారు మక్కా ప్రజలను ఒక్కసారిగా రెచ్చగొట్టకుండా ఉండేందుకు ఇస్లామీయ ధర్మ ప్రచారాన్ని రహస్యంగా ప్రారంభించారు. వారు తమ కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మరియు స్నేహితులకు ఇస్లాంను పరిచయం చేయడం మొదలుపెట్టారు. అలాగే తమకు తెలిసిన వారిలో సత్యాన్ని మరియు మంచితనాన్ని ఇష్టపడే గుణాలు ఉన్న ప్రతి ఒక్కరికీ ఈ ధర్మాన్ని వివరించేవారు.
మొట్టమొదటగా ఇస్లామ్ స్వీకరించినవారు
వారి కంటే ముందుగా వారి భార్య ఖదీజా బింతె ఖువైలిద్(ర) వారు, వారి స్నేహితుడు అబూబక్ర్ సిద్దీఖ్(ర) వారు, వారి పినతండ్రి కుమారుడు అలీ బిన్ అబీ తాలిబ్(ర) వారు మరియు వారి సేవకుడు జైద్ బిన్ హారిసా(ర) వారు ఇస్లాంను స్వీకరించారు.
ఆ తర్వాత అల్లాహ్ నుండి ధర్మప్రచారాన్ని బహిరంగం చేయమని "నీకు అందిన ఆదేశాన్ని బాహాటంగా ప్రకటించు" (అల్-హిజ్ర్: 94) అనే ఆజ్ఞ వచ్చింది. అప్పుడు దైవప్రవక్త ముహమ్మద్(స) వారు ఇస్లామీయ ధర్మప్రచారాన్ని బహిరంగపరిచారు మరియు అల్లాహ్ ఆదేశించిన విధంగా సత్యాన్ని చాటిచెప్పారు.
దైవప్రవక్త ముహమ్మద్(స) వారు ధర్మప్రచారాన్ని బహిరంగం చేసినప్పుడు, ఖురైషీ నాయకులు వివిధ మార్గాల్లో ఆ ప్రచారాన్ని అడ్డుకోవడానికి మరియు దాని నుండి ముఖం చాటేయడానికి ప్రయత్నించారు. ముస్లిములను నిరుత్సాహపరచడానికి, వారి మనోధైర్యాన్ని దెబ్బతీయడానికి, ఇస్లామీయ ధర్మ బోధనలను వక్రీకరించడానికి, అపోహలను సృష్టించడానికి మరియు అబద్ధపు ప్రచారాలు చేయడానికి వారు ఎగతాళి, అవమానం, పరిహాసం మరియు ధిక్కారం వంటి పద్ధతులను అవలంబించారు. అంతేకాకుండా, కొన్ని ప్రయోజనాలను ఆశజూపి ధర్మప్రచారాన్ని వదిలిపెట్టాలని దైవప్రవక్త ముహమ్మద్(స) వారితో బేరసారాలకు దిగారు.
ఈ పద్ధతులు ఏవీ పని చేయవని, దైవప్రవక్త ముహమ్మద్(స) వారు తమ ధర్మప్రచారాన్ని కొనసాగిస్తున్నారని ముష్రిక్కులు గ్రహించినప్పుడు, వారు ఇస్లాంపై యుద్ధం ప్రకటించాలని నిర్ణయించుకున్నారు. వారు దైవప్రవక్త ముహమ్మద్(స) వారిని బాధించడం మరియు వారిని విశ్వసించిన అనుచరులను హింసించడం, వేధించడం ప్రారంభించారు. ముష్రిక్కుల వేధింపులు మితిమీరినప్పుడు, దైవప్రవక్త ముహమ్మద్(స) వారు తమ అనుచరులను అబిసీనియా (హబషా) కు వలస వెళ్ళమని ఆదేశించారు. దీనితో ప్రవక్తత్వపు ఐదవ సంవత్సరంలో ముస్లిములలోని కొంతమంది పురుషులు మరియు స్త్రీలు అక్కడికి వలస వెళ్ళారు.
దైవప్రవక్త ముహమ్మద్(స) వారి ధర్మప్రచారం విజయం మరియు అణిచివేతల మధ్య సాగుతున్న తరుణంలో, ఇస్రా మరియు మేరాజ్ సంఘటన జరిగింది. సుదీర్ఘ కాలం పాటు ధర్మప్రచారం చేస్తూ, ముష్రిక్కుల వేధింపులను, హింసను, తిరస్కారాన్ని మరియు వారి కఠినత్వాన్ని సహనం వహించిన దైవప్రవక్త ముహమ్మద్(స) వారిని గౌరవించడానికి మరియు వారి మనోధైర్యాన్ని దృఢపరచడానికి ఈ సంఘటన సంభవించింది.
మక్కా వెలుపల ధర్మప్రచారం
దైవప్రవక్త ముహమ్మద్(స) వారు మక్కా వెలుపల ఇస్లామీయ ధర్మప్రచారాన్ని ప్రారంభించారు. అందులో భాగంగా వారు తాయిఫ్ నగరానికి వెళ్ళారు. అయితే అక్కడి వారి నుండి తిరస్కారం మరియు విముఖత ఎదురవడంతో వారు తిరిగి మక్కాకు చేరుకున్నారు. ఆ తర్వాత హజ్ సమయాల్లో వివిధ తెగలకు మరియు వ్యక్తులకు ఇస్లాం గురించి వివరించడం ప్రారంభించారు.
అఖబా వద్ద జరిగిన రెండు ప్రతిజ్ఞలు
ప్రవక్తత్వపు పదకొండవ సంవత్సరంలో, హజ్ సమయంలో యస్రిబ్ (దీనిని తర్వాత మదీనా అని పిలిచారు) కు చెందిన ఆరుగురు వ్యక్తులు దైవప్రవక్త ముహమ్మద్(స) వారిని కలిశారు. వారు ఆ వ్యక్తులకు ఇస్లాంను పరిచయం చేసి, దాని వాస్తవికతను వివరించారు. వారిని అల్లాహ్ వైపు ఆహ్వానిస్తూ, వారికి ఖుర్ఆన్ పఠించి వినిపించారు. దీనితో వారు ఇస్లాంను స్వీకరించి, తిరిగి మదీనాకు వెళ్లి తమ జాతి ప్రజలకు ధర్మప్రచారం చేశారు. అలా వారిలో ఇస్లాం వ్యాపించింది. ఆ తర్వాత పన్నెండవ సంవత్సరపు హజ్ సమయంలో మొదటి అఖబా ఒడంబడిక జరిగింది. దానిని అనుసరిస్తూ పదమూడవ సంవత్సరపు హజ్ సమయంలో రెండవ అఖబా ఒడంబడిక అత్యంత రహస్యంగా జరిగింది. ఇది పూర్తయిన తర్వాత, దైవప్రవక్త ముహమ్మద్(స) వారు తమతో ఉన్న ముస్లిములను మదీనాకు వలస వెళ్లమని ఆదేశించారు. అప్పుడు వారు బృందాలుగా బయలుదేరారు.
ముస్లిములలోని అత్యధికులు మక్కా నుండి వలస వెళ్ళిన తర్వాత, దైవప్రవక్త ముహమ్మద్(స) వారు మరియు అబూబక్ర్(ర) వారు మదీనాకు వలస బయలుదేరారు. అయితే ఖురైషీయులను తప్పుదోవ పట్టించేందుకు వారు మదీనా వైపు కాకుండా దానికి వ్యతిరేక దిశలో ప్రయాణించి, సౌర్ గుహకు చేరుకుని అక్కడ మూడు రోజుల పాటు బస చేశారు. ఆ తర్వాత వారు ప్రజలకు అలవాటు లేని మార్గంలో, ఎర్ర సముద్ర తీరానికి సమీపంలో మదీనా వైపు ప్రయాణాన్ని కొనసాగించారు. దైవప్రవక్త ముహమ్మద్(స) వారు మరియు వారి సహచరుడు మదీనా పొలిమేరలకు చేరుకున్నప్పుడు, ముస్లిములు ఎంతో ఉత్సాహంగా మరియు సంతోషంతో వారికి ఘనస్వాగతం పలికారు.
దైవప్రవక్త ముహమ్మద్(స) వారు మదీనా చేరుకున్న తర్వాత చేసిన మొట్టమొదటి పని మస్జిదే నబవీ నిర్మాణం. ఆ తర్వాత వారు వలస వచ్చిన ముస్లిములు (ముహాజిరీన్లు) మరియు మదీనా ముస్లిముల (అన్సార్ల) మధ్య సోదరభావాన్ని నెలకొల్పారు. ఈ విధంగా వారు నూతన ఇస్లామీయ సమాజానికి పునాదులు వేశారు.
మదీనాకు వలస వెళ్ళిన తర్వాత ఇస్లామీయ విధివిధానాలు ఒకదాని తర్వాత ఒకటిగా అవతరించాయి. జకాత్, ఉపవాసం, హజ్, జిహాద్, అదాన్, మంచిని ఆదేశించడం మరియు చెడును నివారించడం వంటి అనేక ఇస్లామీయ నియమావళి అమలులోకి వచ్చాయి.
అల్లాహ్ ముస్లిములకు తమ ధర్మం మరియు తమ రాజ్యాన్ని కాపాడుకోవడానికి, అలాగే ఇస్లామీయ శాశ్వత సందేశాన్ని వ్యాప్తి చేయడానికి యుద్ధం చేసే అనుమతిని ప్రసాదించాడు. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: "ఎవరిపై యుద్ధం చేయబడుతున్నదో, వారు అన్యాయానికి గురయ్యారు గనుక వారికి (తిరిగి యుద్ధం చేసే) అనుమతి ఇవ్వబడింది" (అల్-హజ్: 39). యుద్ధం చేయడానికి అనుమతినిస్తూ అవతరించిన మొట్టమొదటి ఆయత్ ఇది. దైవప్రవక్త ముహమ్మద్(స) వారు స్వయంగా ఇరవై ఏడు యుద్ధాలలో పాల్గొన్నారు మరియు యాభై ఆరు సైనిక దళాలను పంపారు.
హిజ్రత్ తర్వాత జరిగిన అతిముఖ్యమైన సంఘటనలు:
దైవప్రవక్త ముహమ్మద్(స) వారు మదీనాకు హిజ్రత్ (వలస) చేసిన తర్వాత జరిగిన అతిముఖ్యమైన సంఘటనల సంక్షిప్త వివరణ ఇక్కడ ఇవ్వబడింది:
మొదటి హిజ్రీ సంవత్సరం:
రెండవ హిజ్రీ సంవత్సరం:
జకాతు మరియు ఉపవాసాలు విధిగా మార్చబడ్డాయి; అలాగే బద్ర్ మహా సంగ్రామం జరిగినది. ఈ యుద్ధంలో అల్లాహ్ విశ్వాసులకు గౌరవాన్ని ప్రసాదించి, ఖురైష్ అవిశ్వాసులపై వారికి విజయాన్ని చేకూర్చాడు.
మూడవ హిజ్రీ సంవత్సరం.
ఉహుద్ యుద్ధం జరిగినది; ఇందులో యుద్ధ మైదానంలోని కొండపై ఉన్న విలుకాడులు, దైవప్రవక్త ముహమ్మద్(స) వారి ఆదేశాలను ఉల్లంఘించి యుద్ధ సామాగ్రిని సేకరించడం కోసం కిందికి దిగిరావడంతో ముస్లిములకు ఓటమి ఎదురైనది.
హిజ్రీ శకం నాలుగవ సంవత్సరం
బనూ నదీర్ యుద్ధం, దీనిలో బనూ నదీర్ యూదులు మరియు ముస్లిములకు మధ్య ఉన్న ఒడంబడికను ఉల్లంఘించిన కారణంగా దైవప్రవక్త(స) వారు యూదులను మదీనా నగరం నుండి బహిష్కరించారు.
ఐదవ హిజ్రీ సంవత్సరం.
బనూ ముస్తలిఖ్ యుద్ధం, అహ్జాబ్ యుద్ధం మరియు బనూ ఖురైదా యుద్ధం.
ఆరవ హిజ్రీ సంవత్సరం.
ముస్లిములు మరియు ఖురైష్ ల మధ్య జరిగిన హుదైబియా సంధి.
ఏడవ హిజ్రీ సంవత్సరం.
ఖైబర్ యుద్ధం జరిగినది; ఈ సంవత్సరంలోనే దైవప్రవక్త ముహమ్మద్(స) వారు మరియు ముస్లిములు మక్కాలో ప్రవేశించి ఉమ్రతుల్ కదా (గతంలో ఆగిపోయిన ఉమ్రాకు బదులుగా చేసే ఉమ్రా) నిర్వహించారు.
ఎనిమిదవ హిజ్రీ సంవత్సరం.
ముస్లిములకు మరియు రోమన్లకు మధ్య జరిగిన మూతా యుద్ధం, మక్కా విజయం మరియు హవాజిన్, తఖీఫ్ తెగలకు వ్యతిరేకంగా జరిగిన హునైన్ యుద్ధం.
హిజ్రత్ యొక్క తొమ్మిదవ సంవత్సరము
తబూక్ యుద్ధం; ఇది దైవప్రవక్త ముహమ్మద్(స) వారు పాల్గొన్న చివరి యుద్ధం. ఈ సంవత్సరంలోనే అనేక ప్రతినిధి బృందాలు దైవప్రవక్త ముహమ్మద్(స) వారి వద్దకు వచ్చాయి మరియు ప్రజలు గుంపులు గుంపులుగా అల్లాహ్ ధర్మంలో ప్రవేశించారు. అందుకే ఈ సంవత్సరాన్ని 'ఆముల్ వుఫూద్' (ప్రతినిధి బృందాల సంవత్సరం) అని పిలుస్తారు.
పదవ హిజ్రీ సంవత్సరం.
వీడ్కోలు హజ్జు (హజ్జతుల్ విదా) ; ఈ యాత్రలో లక్షకు పైగా ముస్లిములు దైవప్రవక్త ముహమ్మద్(స) వారితో కలిసి హజ్ నిర్వహించారు.
అల్లాహ్ ధర్మ సందేశ ప్రచారం సంపూర్ణమై, ఇస్లాం ధర్మం అరేబియా ద్వీపకల్పమంతటా విస్తరించినప్పుడు మరియు ప్రజలు గుంపులు గుంపులుగా అల్లాహ్ ధర్మంలో ప్రవేశించి, ఈ ధర్మం ప్రపంచవ్యాప్తంగా వ్యాపించే సూచనలు కనిపిస్తూ ఇతర అన్ని ధర్మాలపై విజయకేతనం ఎగురవేసిన తరుణంలో, దైవప్రవక్త ముహమ్మద్(స) వారు తమ అంతిమ గడియలు సమీపిస్తున్నాయని గ్రహించారు. అప్పుడు వారు తమ ప్రభువును కలుసుకోవడానికి సిద్ధపడసాగారు. దైవప్రవక్త ముహమ్మద్(స) వారి మాటలు మరియు పనుల ద్వారా వారు ఈ శాశ్వతం కాని లోకాన్ని వీడి వెళ్లే సమయం ఆసన్నమైందనే సంకేతాలు వెలువడ్డాయి.
పదకొండవ హిజ్రీ సంవత్సరంలో: రబీఉల్ అవ్వల్ నెల పన్నెండవ తేదీ, సోమవారం నాడు దైవప్రవక్త ముహమ్మద్(స) వారు పరమపదించారు.
దైవప్రవక్త ముహమ్మద్(స) వారు అరవై మూడు సంవత్సరాల వయస్సులో పరమపదించారు. అందులో నలభై ఏళ్లు ప్రవక్త పదవికి పూర్వం కాగా, ఇరవై మూడు ఏళ్లు ప్రవక్తగా మరియు దైవసందేశహరునిగా గడిపారు. ఈ ఇరవై మూడు ఏళ్లలో పదమూడు సంవత్సరాలు మక్కాలోను మరియు పది సంవత్సరాలు మదీనాలోను గడిపారు.
దైవప్రవక్త ముహమ్మద్(స) వారు పరమపదించారు, కానీ వారు అందించిన ధర్మం మాత్రం శాశ్వతంగా నిలిచి ఉంది. వారు ఏ ఒక్క మేలును వదలకుండా వాటన్నింటి వైపు ఈ సమాజానికి (ఉమ్మత్) మార్గనిర్దేశం చేశారు, అలాగే ఏ ఒక్క కీడును వదలకుండా వాటన్నింటి గురించి వారిని హెచ్చరించారు. వారు మార్గనిర్దేశం చేసిన ఆ మేలు ఏమిటంటే 'తౌహీద్' (ఏకదైవారాధన) మరియు అల్లాహ్ దేనినైతే ఇష్టపడి, ప్రసన్నుడవుతాడో వాటన్నింటినీ అనుసరించడం. అలాగే వారు హెచ్చరించిన ఆ కీడు ఏమిటంటే 'షిర్క్' (దైవానికి భాగస్వాములను కల్పించడం) మరియు అల్లాహ్ దేనినైతే అసహ్యించుకుని, తిరస్కరిస్తాడో వాటన్నింటికీ దూరంగా ఉండటం.