నేర్చుకుంటూ ఉండండి

మీరు లాగిన్ కాలేదు
మీ పురోగతిని తెలుసుకోవడానికి మరియు పాయింట్లను సేకరించి పోటీల్లోకి ప్రవేశించడానికి ‘త’ వేదికలో ఇప్పుడే నమోదు చేయండి, నమోదు తర్వాత మీరు నేర్చుకున్న అంశాల ఎలక్ట్రానిక్ సర్టిఫికెట్ మీకు లభిస్తుంది.

ప్రస్తుత విభాగం : model

పాఠం అంతిమ దినంపై విశ్వాసం

అంతిమ దినం అంటే అల్లాహ్ ప్రజలందరినీ సమాధుల నుండి పునరుజ్జీవింపజేసే రోజు. ఆ తరువాత అల్లాహ్ వారి కర్మలకు సంబంధించి వారిని విచారించి, తగిన ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు. దీనిపై విశ్వాసం ఉంచడం ఈమాన్ యొక్క మూలాధారాలలో ఒక ముఖ్యమైన మూలాధారం. ఈ పాఠంలో మీరు ఈ రోజుకు సంబంధించిన అనేక ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకుంటారు.

  • అంతిమ దినం అంటే ఏమిటో మరియు దాని ఉనికి వెనుక ఉన్న అంతరార్థాన్ని తెలుసుకోవడం.
  • ప్రళయకాల సూచనలలో కొన్నింటిని గుర్తించడం.
  • అంతిమ దినంపై విశ్వాసానికి సంబంధించిన మరికొన్ని విషయాలను తెలుసుకోవడం.

అంతిమ దినంపై విశ్వాసం అంటే ఏమిటి?

అల్లాహ్ ప్రజలందరినీ సమాధుల నుండి పునరుజ్జీవింపజేస్తాడని, ఆ తర్వాత వారి కర్మల గురించి వారిని విచారించి, తగిన ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడని, చివరకు స్వర్గవాసులు తమ నివాసాలలో మరియు నరకవాసులు తమ నివాసాలలో చేరతారని దృఢంగా విశ్వసించడమే అంతిమ దినంపై విశ్వాసం. అంతిమ దినంపై విశ్వాసం ఉంచడం ఈమాన్ యొక్క మూలాధారాలలో ఒకటి. దీనిపై విశ్వాసం లేకుండా ఈమాన్ అనేది పరిపూర్ణం కాదు. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: “సదాచరణ అంటే వాస్తవానికి అల్లాహ్ ను, అంతిమ దినాన్ని విశ్వసించడం”. (అల్ బఖరా: 177).

తీర్పు దినం అంటే ఏమిటి ?

అంతిమ దినం: ప్రజలందరూ విచారణ మరియు ప్రతిఫలం కోసం పునరుజ్జీవింపబడే రోజు. ఈ రోజున ప్రజలు స్వర్గంలోనో లేదా నరకంలోనో చేరుకుంటారు. దీని తర్వాత మరో రోజు ఉండదు కాబట్టి దీనికి ఈ పేరు వచ్చింది. ఖురాన్ మరియు సున్నత్‌లలో దీనికి అనేక పేర్లు ఉన్నాయి. ఆ రోజున జరిగే అత్యంత భీకరమైన సంఘటనల వల్ల, ముఖ్యంగా ప్రజలందరూ సర్వలోక పరిపాలకుడైన అల్లాహ్ ముందు నిలబడటం వల్ల దీనిని 'ప్రళయ దినం' అని పిలుస్తారు. దీనిని 'సాఆ' (ప్రళయకాలం), 'యౌముల్ ఫస్ల్' (తీర్పు దినం), 'యౌముద్దీన్' (ప్రతిఫల దినం) అని మరియు మరిన్ని పేర్లతో కూడా పిలుస్తారు.

ఖురాన్ అంతిమ దినంపై విశ్వాసాన్ని ఎందుకు నొక్కి చెప్పింది?

పవిత్ర ఖుర్ఆన్ పరలోక దినంపై విశ్వాసం ఉంచడాన్ని నొక్కి చెప్పింది మరియు ప్రతి సందర్భంలోనూ దాని గురించి హెచ్చరించింది. అరబిక్ భాషలోని వివిధ శైలుల ద్వారా అది తప్పక సంభవిస్తుందని ధృవీకరించింది. దీని ప్రాముఖ్యతను తెలియజేయడానికి, ప్రజలు దీని పట్ల అజాగ్రత్తగా ఉండకుండా ఉండేందుకు మరియు విశ్వాసం, సత్కార్యాల ద్వారా ఆ రోజు కోసం సిద్ధపడేలా చేయడానికి అల్లాహ్ అనేక చోట్ల పరలోక దినంపై విశ్వాసాన్ని తనపై విశ్వాసంతో ముడిపెట్టాడు.

పరలోక దినంపై విశ్వాసం ఉంచడం అనేది అల్లాహ్ పట్ల మరియు ఆయన న్యాయశీలత పట్ల విశ్వాసం కలిగి ఉండటానికి ఒక అనివార్యమైన ఫలితం. దీని వివరణ ఈ క్రింది విధంగా ఉంది:

అల్లాహ్ అన్యాయాన్ని అంగీకరించడు మరియు అపరాధిని శిక్షించకుండా, బాధితుడికి న్యాయం చేయకుండా వదిలిపెట్టడు. అలాగే మేలు చేసేవారికి ప్రతిఫలం మరియు బహుమానం ఇవ్వకుండా వదలడు, ప్రతి ఒక్కరికీ వారి హక్కును ప్రసాదిస్తాడు. అయితే ఈ లోకంలో అన్యాయం చేస్తూ జీవించి, ఎటువంటి శిక్ష అనుభవించకుండానే మరణించే వారిని మనం చూస్తున్నాము. అలాగే అన్యాయానికి గురై, తమ హక్కులను పొందకుండానే మరణించే వారినీ చూస్తున్నాము. మరి అల్లాహ్ అన్యాయాన్ని అంగీకరించడు అన్నదానికి అర్థం ఏమిటి? దీని అర్థం ఏమిటంటే, మనం జీవిస్తున్న ఈ జీవితం కాకుండా ఖచ్చితంగా మరొక జీవితం ఉండాలి. మేలు చేసిన వారికి ప్రతిఫలం లభించే, తప్పు చేసిన వారు శిక్షించబడే మరియు ప్రతి ఒక్కరూ తమ హక్కును పొందే మరొక నిర్ణీత సమయం ఖచ్చితంగా ఉండి తీరాలి.

ప్రళయ దిన సంకేతాలు

పరలోక దినంపై విశ్వాసం ఉంచడంలో భాగంగా ప్రళయ దిన సంకేతాలను మరియు దాని ఆనవాళ్ళను విశ్వసించడం కూడా కలిసి ఉంటుంది. ఇవి ప్రళయ దినానికి ముందు సంభవించే సంఘటనలు మరియు అది సమీపించిందనడానికి సూచనలుగా ఉంటాయి. ప్రళయ దిన సంకేతాలు మరియు ఆనవాళ్ళు రెండు రకాలుగా విభజించబడ్డాయి:

1. చిన్న సూచనలు

ప్రళయ కాలానికి ముందు వివిధ కాలాల్లో సంభవించే సూచనలు ఇవి. వాటిలో ఒకటి, గొర్రెల కాపరులైన నిరుపేదలు మరియు కనీసం సరిగ్గా వస్త్రాలు కూడా లేని వారు ఆకాశాన్నంటే భవనాలను నిర్మించడంలో ఒకరితో ఒకరు పోటీ పడటం. దైవదూత జిబ్రయీల్ (అ) వారు దైవప్రవక్త ముహమ్మద్(స) వారిని అడిగిన హదీసులో దీని ప్రస్తావన ఉంది: "జిబ్రయీల్ (అ) వారు 'నాకు ప్రళయ కాలం (ఖియామత్) గురించి తెలపండి' అని కోరారు. దైవప్రవక్త ముహమ్మద్(స) వారు 'దీని గురించి అడిగిన వారి కంటే, అడుగబడిన వారికి (నాకు) ఎక్కువ సమాచారం తెలియదు' అని సెలవిచ్చారు. అప్పుడు జిబ్రయీల్ (అ) వారు 'అయితే దాని సూచనల గురించి తెలపండి' అని అడిగారు. దైవప్రవక్త ముహమ్మద్(స) వారు ఇలా సెలవిచ్చారు: 'దాసి తన యజమానిని కనడం మరియు చెప్పులు లేని వారు, వస్త్రాలు లేని వారు, పేదరికంలో ఉన్న గొర్రెల కాపరులు భారీ భవనాల నిర్మాణంలో ఒకరిని మించి మరొకరు గొప్పలకు పోతూ పోటీ పడటాన్ని మీరు చూడటం' " (ముస్లిం- 8).

2- ప్రధాన సంకేతాలు

ప్రళయ కాలం సమీపించినప్పుడు సంభవించే అతి ముఖ్యమైన మరియు పెద్ద సూచనలు ఇవి. ఇవి మొత్తం పది సూచనలు. హుదైఫా బిన్ ఉసైద్ (ర) వారు ఉల్లేఖించిన హదీసులో ఇలా ఉంది: "మేము ఒక విషయం గురించి చర్చించుకుంటుండగా దైవప్రవక్త ముహమ్మద్(స) వారు మా వద్దకు వచ్చి, 'మీరు దేని గురించి చర్చించుకుంటున్నారు?' అని అడిగారు. అందుకు వారు 'మేము ప్రళయ కాలం గురించి చర్చించుకుంటున్నాము' అని మనవి చేశారు. అప్పుడు వారు ఇలా సెలవిచ్చారు: 'పది సూచనలు కనిపించే వరకు ప్రళయం సంభవించదు'. ఆ తర్వాత వారు పొగ (దుఖాన్), దజ్జాల్, భూమి నుండి వచ్చే జంతువు (దాబ్బతుల్-అర్జ్), సూర్యుడు పశ్చిమం నుండి ఉదయించడం, మరియం కుమారుడు ఈసా (అలైహిస్సలాం) వారి రాక, యాజూజ్-మాజూజ్ మరియు మూడు చోట్ల భూమి కుంగిపోవడం -ఒకటి తూర్పున, రెండోది పశ్చిమన, మూడోది అరబ్ ద్వీపకల్పంలో - గురించి ప్రస్తావించారు. వీటన్నింటి చివరలో యమన్ నుండి ఒక అగ్ని పుట్టి, ప్రజలను వారి సమీకరణ మైదానం (మహ్’షర్) వైపునకు తరుముకుపోతుంది" (ముస్లిం -2901).

అంతిమ దినంపై విశ్వాసం ఉంచడంలో ఏమేమి ఇమిడి ఉన్నాయి?

ముస్లిము పరలోక దినం పై విశ్వాసం ఉంచడంలో అనేక అంశాలు ఇమిడి ఉన్నాయి, అందులో కొన్ని:

1. పునరుత్థానం మరియు మానవాళి అందరినీ ఒకే చోట చేర్చే ప్రక్రియ (హషర్) పై విశ్వాసం:

ఇది సమాధులలో నుండి మరణించిన వారిని సజీవంగా లేపడం మరియు ప్రాణాలను తిరిగి వారి శరీరాలలోకి ప్రవేశింపజేయడం. అప్పుడు ప్రజలందరూ సర్వలోక పరిపాలకుడైన అల్లాహ్ ముందు నిలబడతారు. ఆ తరువాత, వారు మొట్టమొదట జన్మించినప్పుడు ఏ విధంగా ఉన్నారో అదే స్థితిలో, అంటే పాదరక్షలు లేకుండా మరియు వస్త్రాలు లేకుండా ఒకే చోట సమావేశపరచబడతారు. పునరుత్థానం (మరణానంతరం తిరిగి లేపబడటం) పై విశ్వాసం ఉంచాలనే విషయాన్ని పవిత్ర ఖుర్ఆన్, సున్నత్, వివేకం మరియు సహజ స్వభావం (ఫిత్రత్) ధ్రువీకరిస్తున్నాయి. కాబట్టి, అల్లాహ్ సమాధులలో ఉన్నవారిని తిరిగి లేపుతాడని, శరీరాలలోకి ప్రాణాలు తిరిగి వస్తాయని మరియు ప్రజలందరూ సర్వలోక పరిపాలకుడైన అల్లాహ్ ముందు నిలబడతారని మనం ఖచ్చితంగా విశ్వసిస్తాము.

అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: "ఆ తరువాత మీరు నిశ్చయంగా మరణించేవారే. ఆపై ప్రళయ దినమున మీరు నిశ్చయంగా తిరిగి లేపబడతారు." (మూమినూన్ : 15-16). అన్ని దివ్య గ్రంథాలు దీనిని ఏకగ్రీవంగా ధ్రువీకరించాయి. ఇది అల్లాహ్ యొక్క విజ్ఞతకు తగినట్లుగా ఉంది; ఎందుకంటే, అల్లాహ్ తన ప్రవక్తల ద్వారా మానవాళికి అప్పగించిన బాధ్యతలపై వారి ప్రతిఫలాన్ని ఇచ్చేందుకు ఒక పునరాగమనాన్ని ( మరణానంతర జీవితాన్ని) నిర్ణయించడం అల్లాహ్ విజ్ఞతకు నిదర్శనం. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: "మేము మిమ్మల్ని వృథాగా సృష్టించామని, మీరు మా వైపుకు తిరిగి రారని మీరు భావించారా?" (మూమినూన్: 115).

2. కర్మల విచారణ (హిసాబ్) మరియు త్రాసు (మీజాన్) పై విశ్వాసం:

అల్లాహ్ సృష్టిరాసులందరినీ వారు ఈ ప్రాపంచిక జీవితంలో చేసిన కర్మల గురించి విచారిస్తాడు. ఎవరైతే ఏకదైవారాధన (తౌహీద్) మార్గంలో ఉంటూ, అల్లాహ్ మరియు దైవప్రవక్త ముహమ్మద్(స) వారికి విధేయులై ఉంటారో, వారి కర్మల విచారణ సులభంగా జరుగుతుంది. అయితే ఎవరైతే బహుదైవారాధన (షిర్క్) మరియు అవిధేయతకు పాల్పడతారో, వారి కర్మల విచారణ అత్యంత కఠినంగా ఉంటుంది.

మరియు ఒక గొప్ప త్రాసులో కర్మలు తూచబడతాయి. ఒక త్రాసు పళ్లెంలో పుణ్యాలు, మరో త్రాసు పళ్లెంలో పాపాలు ఉంచబడతాయి. ఎవరి పుణ్యాల పళ్లెం పాపాల పళ్లెం కంటే బరువుగా ఉంటుందో, వారు స్వర్గవాసులవుతారు. ఎవరి పాపాల పళ్లెం పుణ్యాల పళ్లెం కంటే బరువుగా ఉంటుందో, వారు నరకవాసులవుతారు. నీ ప్రభువు ఎవరికీ అన్యాయం చేయడు. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: "ప్రళయ దినమున మేము న్యాయమైన త్రాసులను ఉంచుతాము. అప్పుడు ఏ వ్యక్తికీ ఏమాత్రం అన్యాయం జరగదు. అది ఆవగింజంత కర్మ అయినా సరే, మేము దానిని (విచారణకు) తీసుకువస్తాము. లెక్కలు చూడటానికి మేమే చాలు." (అల్-అంబియా: 47).

3. స్వర్గం మరియు నరకం

స్వర్గం శాశ్వతమైన సుఖసంతోషాలకు నిలయం. అల్లాహ్ దీనిని తన పట్ల భయభక్తులు కలిగి ఉండి, అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తలకు విధేయులైన ముస్లిముల కోసం సిద్ధం చేశాడు. అందులో మనసు కోరుకునేవి, కళ్ళకు ఆనందాన్నిచ్చేవి మరియు నిరంతరం లభించే అన్ని రకాల సుఖభోగాలు ఉన్నాయి. అల్లాహ్ తన దాసులను పుణ్యకార్యాల వైపు పురికొల్పుతూ మరియు ఆకాశం, భూమి అంత విశాలమైన స్వర్గంలో ప్రవేశించమని ప్రోత్సహిస్తూ ఇలా సెలవిచ్చాడు: "మీ ప్రభువు క్షమాభిక్ష వైపునకు మరియు ఆకాశం, భూమి అంత వైశాల్యం గల స్వర్గం వైపునకు పరుగెత్తండి. అది దైవభీతి గలవారి కోసం సిద్ధం చేయబడింది." (ఆలె ఇమ్రాన్: 133).

నరకం శాశ్వతమైన శిక్షకు నిలయం. అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తలను తిరస్కరించి, అవిధేయతకు పాల్పడిన అవిశ్వాసుల కోసం అల్లాహ్ దీనిని సిద్ధం చేశాడు. అందులో ఊహకు అందని రకరకాల కఠినమైన శిక్షలు, బాధలు మరియు యాతనలు ఉన్నాయి. అల్లాహ్ తన దాసులను నరకాగ్ని గురించి హెచ్చరిస్తూ ఇలా సెలవిచ్చాడు: "మనుషులు మరియు రాళ్లు ఇంధనంగా గల ఆ నరకాగ్ని నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోండి. అది సత్యతిరస్కారుల కోసం సిద్ధం చేయబడింది." (బఖరా: 24).

ఓ అల్లాహ్! మేము నిన్ను స్వర్గాన్ని మరియు స్వర్గానికి దగ్గర చేసే మాటలను, కర్మలను ప్రసాదించమని వేడుకుంటున్నాము. అలాగే నరకాగ్ని నుండి మరియు నరకానికి దగ్గర చేసే మాటల నుండి, కర్మల నుండి నీ శరణు కోరుతున్నాము.

4. సమాధి శిక్ష మరియు దాని సౌకర్యాలు

మరణం సత్యమని మేము విశ్వసిస్తాము. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: "మీపై నియమించబడిన మృత్యుదూత మీ ప్రాణాలను తీస్తాడు, ఆ తరువాత మీరు మీ ప్రభువు వైపునకు మరలింపబడతారు." (అస్-సజ్దా: 11). ఇది కళ్ళారా చూస్తున్న విషయం, ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఏ కారణం చేతనైనా మరణించినా లేదా చంపబడినా, అది వారి ఆయుష్షు (అజల్) ముగియడం వల్లే జరిగిందని, వారి ఆయుష్షులో ఏమాత్రం తగ్గలేదని మేము విశ్వసిస్తాము. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: "వారి గడువు వచ్చినప్పుడు వారు ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేరు మరియు ముందుకూ జరుపుకోలేరు." (అల్-ఆరాఫ్: 34). ఎవరైతే మరణిస్తారో, వారి ప్రళయం ప్రారంభమైనట్లే మరియు వారు పరలోక నివాసానికి తరలిపోయినట్లేనని మేము విశ్వసిస్తాము.

సమాధిలో అవిశ్వాసులకు మరియు అవిధేయులకు లభించే శిక్ష గురించి, అలాగే విశ్వాసులకు మరియు సజ్జనులకు లభించే సుఖాల గురించి అనేక ఖుర్ఆన్ వాక్యాలు మరియు హదీసులు(దైవప్రవక్త(స) ప్రవచనాలు) స్పష్టంగా పేర్కొన్నాయి. కాబట్టి మేము దానిని విశ్వసిస్తాము, కానీ అది ఏ విధంగా ఉంటుందో (కైఫియత్) అన్న విషయంలో లోతుగా వెళ్ళము. ఎందుకంటే దాని స్వభావాన్ని మరియు యదార్థాన్ని తెలుసుకునే శక్తి మానవ మేధస్సుకు లేదు. అది స్వర్గనరకాల వలె అగోచర (గైబ్) ప్రపంచానికి సంబంధించిన విషయం, మన కళ్లకు కనిపించే ఈ దృశ్యమాన ప్రపంచానికి సంబంధించింది కాదు. మానవ మేధస్సు ఏదైనా విషయాన్ని అంచనా వేయాలన్నా లేదా నిర్ణయించాలన్నా, ఈ లోకంలో దానికి సరితూగే ఉదాహరణలు లేదా నియమాలు ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది.

అలాగే సమాధిలోని స్థితిగతులు అగోచర (గైబ్) విషయాలకు సంబంధించినవి, ఇవి ఇంద్రియాలకు అందవు. ఒకవేళ అవి ఇంద్రియాలకు గోచరమైతే, అగోచర విషయాలపై విశ్వాసం (ఈమాన్ బిల్ గైబ్) అనే దానికి అర్థమే ఉండదు మరియు దైవిక ఆజ్ఞలను పాటించవలసిన బాధ్యత యొక్క విజ్ఞత కూడా అంతమైపోతుంది. అంతేకాక, మనుషులు ఒకరినొకరు ఖననం చేయడం కూడా మానేస్తారు. ప్రవక్త ముహమ్మద్(స) వారు ఇలా సెలవిచ్చారు: "మీరు ఒకరినొకరు ఖననం చేయడం మానేస్తారన్న భయం లేకపోతే, సమాధి శిక్షను మీకు వినిపించమని నేను అల్లాహ్‌ను వేడుకునేవాడిని." (ముస్లిం 2868, నసాయి 2058). ఈ విజ్ఞత జంతువుల విషయంలో వర్తించదు కాబట్టి, అవి ఆ శిక్షను వినగలవు మరియు గ్రహించగలవు. ప్రవక్త(స) వారు ఇలా సెలవిచ్చారు: "నిశ్చయంగా వారు శిక్షించబడుతున్నారు, ఆ శిక్షను జంతువులు వింటాయి." (బుఖారీ 6366, ముస్లిం 586).

పునరుజ్జీవనాన్ని నిరూపించడానికి ఖుర్ఆన్ చూపుతున్న ఆధారాలలో కొన్ని:

మరణం తర్వాత పునరుజ్జీవనం (నిజమని) నిరూపించడానికి పవిత్ర ఖుర్ఆన్‌లో అనేక ఆధారాలు ఉన్నాయి. ఆ ఆధారాలలో కొన్ని:

అల్లాహ్ మానవాళిని మొదటిసారి సృష్టించాడు. సృష్టిని ప్రారంభించగలిగిన శక్తిమంతుడు, దానిని తిరిగి పునరుద్ధరించడానికి అశక్తుడు కాడు. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: "ఆయనే సృష్టిని ప్రారంభిస్తాడు, ఆపై ఆయనే దానిని తిరిగి పునరుద్ధరిస్తాడు" (రూమ్: 27). ఎముకలు కృశించిపోయిన తర్వాత వాటికి తిరిగి జీవం పోయడాన్ని నిరాకరించే వారికి బదులివ్వమని ఆజ్ఞాపిస్తూ అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: "వీటికి మొదటిసారి ఎవరు జీవం పోశారో, ఆయనే వీటికి తిరిగి జీవం పోస్తాడని చెప్పు. ప్రతి ఒక్క సృష్టి గురించి ఆయనకు (సృష్టించే విధానం గురించి) బాగా తెలుసు" (యాసీన్: 79).

భూమి ఎండిపోయి, నిర్జీవంగా మారి, దానిపై ఎటువంటి పచ్చని చెట్టు లేని స్థితిలో ఉన్నప్పుడు, అల్లాహ్ దానిపై వర్షాన్ని కురిపిస్తాడు. దానితో అది చైతన్యవంతమై, పచ్చదనంతో జీవం పోసుకుని, ప్రతి రకమైన అందమైన జంటలను మొలిపిస్తుంది. భూమి మరణించిన తర్వాత దానికి తిరిగి జీవం పోయగలిగిన శక్తిమంతుడు, మరణించిన వారికి కూడా తిరిగి జీవం పోయగలడు. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: "మేము ఆకాశం నుండి శుభప్రదమైన నీటిని కురిపించాము. దాని ద్వారా తోటలను, కోతకు వచ్చే ధాన్యపు గింజలను మొలిపించాము. ఇంకా పొడవాటి ఖర్జూరపు చెట్లను, ఒకదానిపై ఒకటి పేర్చబడినట్లుండే గెలలతో మొలిపించాము. ఇదంతా దాసుల పోషణ కొరకు. ఆ నీటి ద్వారా మేము మృత భూమికి తిరిగి జీవం పోశాము. (మరణించిన వారు ప్రళయ దినాన తిరిగి) బయటకు రావడం కూడా ఇదే విధంగా ఉంటుంది" (ఖాఫ్: 9-11).

వివేకవంతులైన ప్రతి ఒక్కరికీ తెలిసిన విషయమేమిటంటే, ఒక గొప్ప మరియు భారీ కార్యాన్ని చేయగలిగిన శక్తిమంతుడు, దానికంటే తక్కువ స్థాయి పనిని మరెంతో సునాయాసంగా చేయగలడు. అల్లాహ్ అత్యంత విశాలమైన, అపారమైన మరియు అద్భుతమైన సృష్టి కలిగిన ఆకాశాలను, భూమిని మరియు గ్రహమండలాలను సృష్టించాడు. అలాంటప్పుడు, శిథిలమైపోయిన ఎముకలకు తిరిగి జీవం పోయడం ఆయనకు మరెంతో సులభమైన విషయం. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ఆకాశాలను మరియు భూమిని సృష్టించిన వాడు, వారి వంటి వారిని (మళ్ళీ) సృష్టించలేడా? ఎందుకు సృష్టించలేడు? తప్పకుండా సృష్టించగలడు. ఆయనే సర్వ సృష్టికర్త మరియు సర్వజ్ఞుడు (యాసీన్: 81).

పరలోక దినంపై విశ్వాసం ఉంచడం వల్ల కలిగే శుభప్రదమైన ఫలితాలు:

1- పరలోక దినంపై విశ్వాసం కలిగి ఉండటం అనేది ఒక ముస్లిము యొక్క ప్రవర్తనను మలచడంలో, క్రమశిక్షణతో ఉండటంలో, సత్కార్యాలు ఆచరించడంలో మరియు అల్లాహ్ పట్ల భయభక్తులు (తఖ్వా) కలిగి ఉండి చెడు గుణాలకు, దుశ్చర్యలకు దూరంగా ఉండటంలో అత్యంత ప్రభావం చూపుతుంది. అందుకే అనేక సందర్భాల్లో పరలోక దినంపై విశ్వాసానికి మరియు సత్కార్యాలకు మధ్య సంబంధం ముడిపడి ఉంటుంది. దీనికి ఉదాహరణగా అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: అల్లాహ్‌ను మరియు పరలోక దినాన్ని విశ్వసించేవారు మాత్రమే అల్లాహ్ యొక్క మస్జిదులను ఆరాధనలతో సజీవంగా ఉంచుతారు/నిర్మిస్తారు). (అత్-తౌబా: 18) అలాగే మరొక చోట ఇలా సెలవిచ్చాడు: "ఎవరైతే పరలోకాన్ని విశ్వసిస్తారో, వారు దీనిని (ఖుర్ఆన్‌ను) కూడా విశ్వసిస్తారు మరియు వారు తమ నమాజులను క్రమం తప్పకుండా పాటిస్తారు." (అల్-అన్ఆమ్: 92).

2- ప్రాపంచిక వ్యవహారాలలో మరియు దాని సుఖాలలో మునిగిపోయి, అల్లాహ్ సామీప్యం కోసం చేసే ఆరాధనల్లో పోటీ పడటాన్ని మరియు సమయాన్ని సద్వినియోగం చేసుకోవడాన్ని విస్మరించిన అజ్ఞానులను హెచ్చరించడం; జీవితం యొక్క యదార్థం మరియు అది చాలా స్వల్పమైనదని, కేవలం పరలోకమే శాశ్వతమైనదని మరియు స్థిరమైన నివాసమని వారికి గుర్తుచేయడం. ఖుర్ఆన్‌లో అల్లాహ్ ప్రవక్తలను ప్రశంసిస్తూ వారి సత్కార్యాలను ప్రస్తావించినప్పుడు, ఆ పనులకు వారిని ప్రేరేపించిన అసలు కారణాన్ని మెచ్చుకుంటూ ఇలా సెలవిచ్చాడు: "నిశ్చయంగా మేము వారిని ఒక ప్రత్యేక గుణం కోసం ఎంచుకున్నాము, అదేమిటంటే పరలోక నివాసాన్ని నిరంతరం స్మరించుకోవడం." (సాద్: 46). అంటే, వారు ఆ సదాచారణలు ఆచరించడానికి కారణం, వారు పరలోక లోకాన్ని గుర్తుంచుకోవడంలో ప్రత్యేకతను కలిగి ఉండటమే. ఆ స్మరణే వారిని అటువంటి సత్కార్యాల వైపు మరియు ఉన్నతమైన నిర్ణయాల వైపు నడిపించింది.

అల్లాహ్ మరియు దైవప్రవక్త వారి ఆజ్ఞను పాటించడంలో కొంతమంది ముస్లిములు సోమరితనం ప్రదర్శించినప్పుడు, అల్లాహ్ వారిని హెచ్చరిస్తూ ఇలా సెలవిచ్చాడు: "ఏమిటి, మీరు పరలోకానికి బదులుగా ఈ ప్రాపంచిక జీవితానికే మొగ్గు చూపుతున్నారా? పరలోకం ముందు ఈ ప్రాపంచిక జీవిత సుఖాలు చాలా స్వల్పమైనవి." (తౌబా: 38). మనిషి పరలోక దినాన్ని విశ్వసించినప్పుడు, ఇహలోకంలోని ఏ సుఖమైనా పరలోక సుఖంతో ఏమాత్రం సరితూగదని మరియు పరలోకంలోని శిక్షలో ఒక చిన్న మునకకు కూడా ఇది సమానం కాదని గ్రహిస్తాడు. అలాగే అల్లాహ్ మార్గంలో ఇహలోకంలో ఎదురయ్యే ఏ కష్టమైనా పరలోక శిక్షతో పోల్చితే ఏమాత్రం లెక్కలోకి రాదని మరియు పరలోకంలోని అపారమైన సుఖాలలో ఒక చిన్న మునక వేస్తే ఆ కష్టాలన్నీ మర్చిపోతారని అతను దృఢంగా విశ్వసిస్తాడు.

3- హక్కు ఎన్నటికీ వృథా కాదనే భరోసా కలగడం; ఎవరి వద్ద నుండి అయినా ఇసుమంతైనా అన్యాయంగా తీసుకోబడితే, వారు అత్యంత అవసరంలో ఉన్నప్పుడు ప్రళయ దినమున దానిని తిరిగి పొందుతారు. తన హక్కు అత్యంత కీలకమైన మరియు ప్రమాదకరమైన క్షణాల్లో తప్పకుండా తనకు లభిస్తుందని తెలిసిన వ్యక్తి ఎందుకు చింతిస్తాడు? తనకూ మరియు తన విరోధులకూ మధ్య తీర్పు ఇచ్చేవాడు మహోన్నతుడైన అల్లాహ్, అంటే పాలకులందరిలోకి గొప్ప పాలకుడని తెలిసిన వ్యక్తి ఎందుకు బాధపడతాడు?

మీరు విజయవంతంగా మీ పాఠాలను పూర్తి చేశారు


పరీక్ష మొదలుపెట్టండి