ప్రస్తుత విభాగం : model
పాఠం మరణం మరియు జీవితం యొక్క యదార్థం
మరణం అనేది అంతం కాదు, అది మనిషికి ఒక నూతన దశ మరియు పరలోకంలోని సంపూర్ణ జీవితానికి ఆరంభం. ఇస్లాం ధర్మం జన్మించినప్పటి నుండి హక్కుల పరిరక్షణపై ఏ విధంగానైతే శ్రద్ధ వహించిందో, అదే విధంగా మరణించిన వ్యక్తి యొక్క హక్కులను కాపాడే మరియు వారి కుటుంబ సభ్యుల, బంధువుల పరిస్థితిని గమనించే నిబంధనలను కూడా ఖచ్చితంగా నిర్దేశించింది.
అల్లాహ్ ఈ ఇహలోక జీవితంలో మనల్ని సృష్టించి, మనకు ఉనికిని ప్రసాదించింది మనల్ని పరీక్షించడానికి మరియు శోధించడానికే. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: (మీలో ఎవరు ఉత్తమమైన కార్యాలు చేస్తారో పరీక్షించేందుకు ఆయన మరణాన్ని మరియు జీవితాన్ని సృష్టించాడు) (అల్-ముల్క్: 2). కాబట్టి ఎవరైతే విశ్వాసం పొంది, దైవభీతితో మెలుగుతారో వారు స్వర్గంలో ప్రవేశిస్తారు, మరియు ఎవరైతే మార్గభ్రష్టత్వాన్ని, పెడదోవను ఎంచుకుంటారో వారు నరకానికి చేరుకుంటారు.
ఈ లోకంలో మనిషి జీవితం ఎంత సుదీర్ఘమైనదైనా అది ముగిసిపోయేదే మరియు శాశ్వతం కానిది. శాశ్వతత్వం, నిరంతర ఉనికి మరియు అనంతమైన జీవితం పరలోకంలోనే ఉన్నాయి. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: (నిశ్చయంగా పరలోక గృహమే అసలైన జీవితం, వారు తెలుసుకోగలిగితే!) (అల్-అన్కబూత్: 64).
అల్లాహ్ తన సృష్టి అంతటిలో శ్రేష్ఠులైన వారు - మన దైవప్రవక్త ముహమ్మద్(స) వారితో - సామాన్య ప్రజల వలెనే వారు కూడా మరణిస్తారని మరియు ఆ తర్వాత అందరూ అల్లాహ్ వద్ద సమావేశమై తమ వివాదాల పరిష్కారాన్ని పొందుతారని ఇలా సెలవిచ్చాడు: (నిశ్చయంగా నీవు మరణించేవాడవు మరియు వారు కూడా మరణించేవారే (30) ఆపై ప్రళయ దినమున మీరు మీ ప్రభువు సన్నిధిలో వాదించుకుంటారు) (అజ్-జుమర్: 30, 31).
దైవప్రవక్త ముహమ్మద్(స) వారు తన పరిస్థితిని - మరియు ప్రతి మనిషి పరిస్థితిని - పరలోకంతో పోల్చితే ఈ ఇహలోకం ఎంత స్వల్పమైనదో వివరిస్తూ, ఒక చెట్టు నీడన కాసేపు విశ్రమించి, నిద్రించి, ఆపై దానిని వదిలి వెళ్ళిపోయే ప్రయాణికుడితో పోల్చారు. దైవప్రవక్త ముహమ్మద్(స) వారు ఇలా సెలవిచ్చారు: "నాకు ఈ ఇహలోకంతో ఏమి పని? ఈ ప్రపంచంలో నా ఉదాహరణ ఒక చెట్టు నీడన విశ్రమించి, ఆపై దానిని వదిలి తన దారిన వెళ్ళిపోయే ప్రయాణికుడి వంటిది" (తిర్మిది 2377, ఇబ్న్ మాజా 4109).
అల్లాహ్ మనకు యాఖూబ్ (అ) వారు తన కుమారులకు చేసిన ఉపదేశాన్ని ఇలా వివరించాడు: (నిశ్చయంగా అల్లాహ్ మీ కోసం ఈ ధర్మాన్ని ఎంచుకున్నాడు, కాబట్టి మీరు ముస్లిములు(విశ్వాసులుగా)గా తప్ప మరణించకండి) (అల్-బఖర: 132).
అల్లాహ్ నిర్ణయించిన మరణ సమయం ఎప్పుడు వస్తుందో, అది ఎక్కడ సంభవిస్తుందో ఎవరికీ తెలియదు మరియు దానిని మార్చే శక్తి కూడా ఎవరికీ లేదు. కావున, వివేకవంతుడైన వాడు తన రోజులను, సమయాన్ని సత్కార్యాలతో, పుణ్యకార్యాలతో మరియు ధర్మనిష్ఠతో నింపుకోవాలి. ఎందుకంటే అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: (ప్రతి జాతికి ఒక నిర్ణీత సమయం ఉంది; వారి గడువు వచ్చినప్పుడు, వారు దానిని ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేరు మరియు ముందుకు జరపలేరు) (అల్-అరాఫ్: 34).
శరీరం నుండి ప్రాణం విడివడి మరణించిన ప్రతి ఒక్కరి ప్రళయం అప్పుడే ప్రారంభమవుతుంది. తద్వారా వారు పరలోక ప్రయాణాన్ని మొదలుపెడతారు. ఇది అదృశ్య జ్ఞానానికి (గైబ్) సంబంధించిన విషయం కావడంతో, మానవ మేధస్సు దాని లోతుపాతులను లేదా అది ఎలా జరుగుతుందో వివరంగా తెలుసుకోవడం సాధ్యం కాదు.
జన్మించిన నాటి నుండి శైశవదశ, బాల్యం, యవ్వనం మరియు వృద్ధాప్యం వరకు మనిషికి సంబంధించిన నియమ నిబంధనలను, మర్యాదలను ఇస్లామీయ నియమావళి (షరీఅత్) ఏ విధంగానైతే పరిగణనలోకి తీసుకుందో, అదే విధంగా మరణించిన వ్యక్తి యొక్క హక్కులను కాపాడేందుకు మరియు వారి కుటుంబ సభ్యుల, బంధువుల స్థితిగతులను గమనించేందుకు కూడా మనకు కొన్ని నియమాలను, మర్యాదలను నిర్దేశించింది. ఈ ధర్మాన్ని సంపూర్ణం చేసి, తన అనుగ్రహాన్ని పూర్తి చేసి, ఈ గొప్ప ధర్మం వైపు మనకు మార్గదర్శకత్వం వహించిన అల్లాహ్ కే సర్వస్తుతులు.
అనారోగ్యగ్రస్తుడిని సందర్శించిన వారు, వారికి స్వస్థత మరియు క్షేమం చేకూరాలని, అలాగే ఆ అనారోగ్యం వారి పాపాలను కడిగివేసేదిగా మరియు తప్పులకు ప్రాయశ్చిత్తంగా ఉండాలని ప్రార్థించాలి. దైవప్రవక్త ముహమ్మద్(స) వారు అనారోగ్యగ్రస్తుడితో ఇలా సెలవిచ్చేవారు: ‘లా బాస్, తహూర్ ఇన్ షా అల్లాహ్’. ఏమీ పర్వాలేదు, అల్లాహ్ చిత్తగిస్తే ఇది నిన్ను పరిశుద్ధుడిని చేస్తుంది" (బుఖారీ 3616).
అనారోగ్యగ్రస్తుడు వ్యాధిని ఎదిరించి, త్వరగా కోలుకోవడానికి మనోధైర్యాన్ని ఇచ్చే పదాలను మరియు వాక్యాలను ఎంచుకోవాలి. అల్లాహ్ వైపునకు ఆహ్వానించడానికి అనువైన సందర్భాలను ఉపయోగించుకోవాలి. విజ్ఞతతో మరియు చక్కని హితబోధతో అనారోగ్యగ్రస్తుడికి అల్లాహ్ గురించి, పరలోక దినం గురించి గుర్తు చేయాలి. దీనికి సంబంధించి దైవప్రవక్త ముహమ్మద్(స) వారు అత్యుత్తమ ఉదాహరణను చూపారు. అనస్(ర) వారు ఇలా ఉల్లేఖించారు: ఒక యూద బాలుడు దైవప్రవక్త ముహమ్మద్(స) వారి వద్ద సేవ చేసేవాడు. అతను అనారోగ్యానికి గురైనప్పుడు, దైవప్రవక్త ముహమ్మద్(స) వారు అతడిని పరామర్శించడానికి వెళ్లారు. వారు అతని తల వైపు కూర్చుని, "నీవు ఇస్లాంను స్వీకరించు" అని సెలవిచ్చారు. అప్పుడు ఆ బాలుడు తన తండ్రి వైపు చూశాడు. ఆ తండ్రి, "అబుల్ ఖాసిమ్ (స) గారి మాటకు విధేయత చూపు" అని చెప్పాడు. వెంటనే ఆ బాలుడు ఇస్లాంను స్వీకరించాడు. అప్పుడు దైవప్రవక్త ముహమ్మద్(స) వారు బయటకు వస్తూ ఇలా సెలవిచ్చారు: "అతడిని నరకాగ్ని నుండి రక్షించిన అల్లాహ్ కే సర్వస్తుతులు" (బుఖారీ 1356).
2. ప్రాణం విడిచే సమయంలో 'లా ఇలాహ ఇల్లల్లాహ్' అనే సాక్ష్య వాక్యాన్ని (కలిమా) వారికి గుర్తు చేయడం (తల్ఖీన్).
ఒకవేళ అనారోగ్యగ్రస్తుడిలో మరణం త్వరలో సంభవిస్తుందనే సంకేతాలు (ప్రాణం విడిచే లక్షణాలు) కనిపిస్తే, విజ్ఞతతో మరియు సరైన పద్ధతిలో అతడికి ఏకదైవారాధన వాక్యం మరియు స్వర్గపు తాళంచెవి అయిన 'లా ఇలాహ ఇల్లల్లాహ్' (అల్లాహ్ తప్ప మరొక ఆరాధ్యుడు లేడు) అని గుర్తు చేయడం (తల్ఖీన్) మరియు దానిని పలికేలా ప్రోత్సహించడం ఉత్తమం (ముస్తహబ్). దీని గురించి దైవప్రవక్త ముహమ్మద్(స) వారు ఇలా సెలవిచ్చారు: "మరణించే స్థితిలో ఉన్న మీ వారికి 'లా ఇలాహ ఇల్లల్లాహ్' అని గుర్తు చేయండి" (ముస్లిం 916).
ఒక మనిషి తన జీవితకాలంలో మరియు మరణ సమయంలో పలికే మాటలన్నింటిలో ఇది అత్యంత గొప్పది. ఎవరికైతే ఈ కలిమా వారి చివరి మాటగా ఉండే భాగ్యం కలుగుతుందో, వారు ఒక గొప్ప గౌరవాన్ని పొందినట్లే. దీని గురించి దైవప్రవక్త ముహమ్మద్(స) వారు ఇలా సెలవిచ్చారు: "ఎవరి చివరి మాట 'లా ఇలాహ ఇల్లల్లాహ్' అని ఉంటుందో, వారు స్వర్గంలో ప్రవేశిస్తారు" (అబూ దావూద్ 3116).
ప్రాణం విడిచే వారిని ఖిబ్లా వైపునకు తిప్పడం ఉత్తమం. దైవప్రవక్త ముహమ్మద్(స) వారు ఇలా సెలవిచ్చారు: "కాబా గృహం (బైతుల్లాహ్) మీరు బ్రతికున్నప్పుడూ మరియు మరణించినప్పుడూ మీ ఖిబ్లా" (అబూ దావూద్ 2875). కాబట్టి ప్రాణం విడిచే వారిని, సమాధిలో ఉంచే విధంగా కుడి వైపునకు వాల్చి ముఖాన్ని ఖిబ్లా వైపునకు తిప్పాలి.